ఖమ్మం, ఏప్రిల్ 24(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/కల్లూరు;కర్ణాటక సాధారణ ఎన్నికల్లో బీజేపీకి పరాజయం తప్పదని భావించిన అమిత్ షా అర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నారని, ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు మండిపడ్డారు. కల్లూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణంలో సోమవారం సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అధ్యక్షతన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఢిల్లీ నేతలకు గులాంగిరీ చేస్తే, బీజేపీ నాయకులు గుజరాత్ నేతలకు గులాంగిరీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్కు మాత్రం ప్రజలే హై కమాండ్ అని పేర్కొన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడా ధాన్యం సేకరించడం లేదని, తెలంగాణలో మాత్రం రైతు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నదన్నారు. అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులు ఆందోళన చెందవద్దని ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఈ సమ్మేళనానికి ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథిరెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధు, రాష్ట్ర మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, జడ్పీచైర్మన్ లింగాల కమల్రాజు తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ఎండను సైతం లెక్క చేయకుండా పెద్ద ఎత్తున తరలొచ్చారు. చేవెళ్లలో ఆదివారం జరిగిన బీజేపీ సభ కంటే కల్లూరు ఆత్మీయ సమ్మేళనానికి భారీగా కార్యకర్తలు, ప్రజలు హాజరయ్యారని హరీశ్రావు చెప్పడంతో సభా ప్రాంగణం హర్షధ్వానాలతో మార్మోగింది.
కాంగ్రెస్ పార్టీ నాయకులు ఢిల్లీ నేతలకు గులాంగిరీ చేస్తే, బీజేపీ నాయకులు గుజరాత్ నేతలకు గులాంగిరీ చేస్తున్నారని, కానీ బీఆర్ఎస్కు మాత్రం ప్రజలే హైకమాండ్ అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అధ్యక్షతన నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. చేవెళ్లలో ఆదివారం జరిగిన బీజేపీ సభకు నాలుగు జిల్లాల నుంచి ప్రజలను తరలించామని గొప్పలు చెప్తున్నారన్నారు. కల్లూరు నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనానికి హాజరైనంత మంది కార్యకర్తలు, ప్రజలు కూడా హాజరు కాలేదని ఎద్దేవా చేశారు. కర్ణాటక సాధారణ ఎన్నికల్లో బీజేపీకి పరాజయం తప్పదని భావించిన అమిత్ షా అర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నారని, ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, కరువు జిల్లాల ప్యాకేజీ, ప్రాజెక్ట్కు జాతీయ హోదా, ఏపీలో విలీనం చేసిన ముంపు మండలాల గురించి ఒక్క మాట అయినా మాట్లాడకపోవడం సిగ్గుచేటన్నారు.
ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన అభ్యర్థులకు డిపాజిైట్లెనా వస్తాయా.. అని నాటి నాయకులు హేళన చేసేవారని, కానీ ఇప్పుడు ఇదే జిల్లాలో బీఆర్ఎస్ బలమైన శక్తిగా ఎదిగిందని కొనియాడారు. నిజం చెప్పకుండా ఉంటే అబద్ధాలు రాజ్యమేలుతాయని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నాడే చెప్పారని, తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని సగర్వంగా చెప్పుకుంటున్నామన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులు నిరాదరణకు గురయ్యారన్నారు. ఎరువులు, విత్తనాలు సకాలంలో అందక రైతులు నానా అవస్థలు పడ్డారని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ విజన్తో రాష్ట్రంలో సాగు పండుగ అయిందన్నారు. 2014 యాసంగిలో రాష్ట్రవ్యాప్తంగా కేవలం 14 లక్షల ఎకరాల్లో పంటలు సాగు అయితే, ఈ యాసంగిలో ఆ విస్తీర్ణం 56 లక్షల ఎకరాలకు చేరుకున్నదన్నారు. దేశం మొత్తం మీద ఎంత ధాన్యం పండుతుందో, అంత దిగుబడి ఒక్క తెలంగాణ నుంచే ఉంటుందన్నారు. రైతుల పక్షపాతిగా కేసీఆర్ రైతుబంధు, రైతుబీమా, పంటలకు ఉచిత కరెంట్ వంటి పథకాలు అమలు చేస్తున్నారన్నారు. కరువు అనే పదాన్ని సీఎం కేసీఆర్ తెలంగాణ డిక్షనరీ నుంచి తీసివేశారని కొనియాడారు.
బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడా ధాన్యం సేకరణ జరగడం లేదని, తెలంగాణలో మాత్రం రైతు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నదన్నారు. అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులు అనవసరంగా బాధపడొద్దన్నారు. గత నెలలో పంట నష్టపోయిన రైతులకు సీఎం కేసీఆర్ ఎకరానికి రూ.10 వేల చొప్పున పరిహారం ప్రకటించి విడుదల చేశారని గుర్తుచేశారు. అదేవిధంగా ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులనూ ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసానిచ్చారు. ఇప్పటికే ప్రభుత్వ సీఎస్ ఈ అంశంపై కసరత్తు చేస్తున్నారని స్పష్టం చేశారు. తెలంగాణలో ఏ ఊరికి వెళ్లినా మిషన్ భగీరథ నీటి సరఫరా ఉంటుందని, పొరుగు రాష్ర్టాల్లో ఆ పరిస్థితి లేదన్నారు. ప్రస్తుత మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క ఉమ్మడి పాలనలోనూ ఉన్నత పదవుల్లో కొనసాగారని, కానీ మధిరకు కనీసం 100 పడకల ఆసుపత్రైనా తెచ్చుకోలేకపోయారని విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు కొత్తగూడెం, ఖమ్మానికి ఎందుకు మెడికల్ కాలేజీ తీసుకురాలేకపోయారని ప్రశ్నించారు. ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా సీతారామ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నదన్నారు. ప్రాజెక్ట్ పూర్తయితే లక్షలాది ఎకరాల భూములకు సాగునీరు అందుతుందన్నారు. సత్తుపల్లి వరకు సాగునీరు తీసుకొస్తామన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు పన్నినా వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్దే విజయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఖమ్మం జడ్పీపరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజు, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, డీసీఎంఎస్ చైర్మన్ రాయల వెంకటశేషగిరిరావు, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, కల్లూరు, పెనుబల్లి ఎంపీపీలు బీరెల్లి రఘు, లక్కినేని అలేఖ్య, జడ్పీటీసీ కట్టా అజయ్కుమార్, సర్పంచ్ లక్కినేని నీరజ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాలెపు రామారావు, రైతుబంధు సమితి మండల కన్వీనర్ లక్కినేని రఘు, నాయకులు బొమ్మెర రామ్మూర్తి, పసుమర్తి చంద్రరావు, బోబోలు లక్ష్మణరావు, కొరకొప్పుల ప్రసాద్, కాటంనేని వెంకటేశ్వరరావు, పిడకంటి రామకృష్ణ, ఇస్మాయిల్ పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను సుదీర్ఘ కాలం పాటు పరిపాలించింది. కానీ మెడికల్ కళాశాలల ఏర్పాటు అన్న విషయాన్నే పట్టించుకోలేదు. సీఎం కేసీఆర్ తనదైన విజన్తో జిల్లాకో మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తున్నారు. దీనిలో భాగంగా ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో రెండు మెడికల్ కళాశాలలు మంజూరయ్యాయి. ఖమ్మం మెడికల్ కళాశాలలో ఈ ఏడాది నుంచే తరగతులు మొదలు కానున్నాయి. మెడికల్ కళాశాలల ఏర్పాటుకు కృషి చేసినందుకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ దేశవ్యాప్తంగా 177 మెడికల్ కళాశాలలు మంజూరు చేసింది. తెలంగాణకు ఒక్కటంటే ఒక్క కళాశాలైనా మంజూరు చేయలేదు. చేవెళ్ల బీజేపీ సభలో ఆ పార్టీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ ప్రజల కోసం ఏం చేస్తారో చెప్పనేలేదు. పైగా తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ముస్లిం రిజర్వేషన్లను ఎత్తివేస్తామని ప్రకటించడం సిగ్గుచేటు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రగతి భవన్ను కూల్చివేస్తామని అరాచకంగా మాట్లాడుతున్నారు. సోదరభావంతో మెలుగుతున్న ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారు. వారందరికీ ప్రజలే బుద్ధి చెప్తారు. మరోవైపు సీఎం కేసీఆర్ను పొగిడిన వారే నేడు ఆయన్ను విమర్శిస్తున్నారు. ఎవరెన్ని మాట్లాడిన రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్దే విజయం. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోవడం ఖాయం.
– రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్
కల్లూరు బస్టాండ్ అభివృద్ధికి రూ.కోటి విరాళం..
తెలంగాణలో పల్లెలు, పట్టణాల్లో పండుగ వాతావరణం నెలకొంటున్నది. ప్రతిరోజూ ఏదో ఒకచోట అభివృద్ధి పనులు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలతో రాష్ట్రం సందడిగా మారింది. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాల గురించి ఇప్పుడు చిన్న పిల్లలు కూడా చెప్తున్నారంటే అది కచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ విజయమే. మరోవైపు ఉత్సాహంగా బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు జరుగుతున్నాయి. కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపుతున్నాయి. ప్రతి జిల్లాలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తూ సీఎం కేసీఆర్ ప్రతి జిల్లాను హెల్త్ హబ్గా మారుస్తున్నారు. నియోజకవర్గ యువత కోసం ప్రతి నెలలో వంద మందికి ఇంటర్వ్యూలు ఏర్పాటు చేస్తాను. కల్లూరు బస్టాండ్ అభివృద్ధికి సచివాలయం ప్రారంభోత్సవం రోజు మంత్రి అజయ్కుమార్కు రూ.కోటి చెక్కు అందజేస్తాను.
– రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డి
తెలంగాణ దేశానికే రోల్మాడల్..
అభివృద్ధి సంక్షేమం రాష్ట్రంలో జోడెడ్లలా సాగుతున్నాయి. ఇప్పుడు దేశానికి తెలంగాణ రోల్మాడల్. అన్ని రంగాల్లోనూ రాష్ట్రం అగ్రగామి. సీఎం కేసీఆర్ విజన్తో ప్రతి ఇంటికీ ఏదో ఒక సంక్షేమ పథకం అందింది. కుల మతాలకు అతీతంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. వర్గ విభేదాలు, వైషమ్యాలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో ఉంటాయి. కానీ బీఆర్ఎస్లో మాత్రం ప్రజా సంక్షేమమే ఉంటుంది. ఉద్యమ నేతగా ప్రజల కష్టాలు చూసిన కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక్కో సమస్యను పరిష్కరిస్తూ వస్తున్నారు. ప్రజాభిమానాన్ని చూరగొంటున్నారు.
– ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
కేసీఆర్కే కేంద్రంలోని బీజేపీ సర్కార్ను దించే సత్తా..
కేంద్రంలోని బీజేపీని గద్దె దించే సత్తా ఒక్క బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్కే ఉన్నది. ఆయన నాయకత్వంలో మున్ముందు జాతీయ రాజకీయాల్లో సమూల మార్పులు రానున్నాయి. కేసీఆర్ విజన్ ప్రకారం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కార్యదీక్షతో పనిచేస్తున్నారు. పట్టణాలు, పల్లెలను అభివృద్ధి బాట పట్టిస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులు అతీగతి లేని నాయకుల మాటలు నమ్మొద్దు. నమ్మి మోసపోవద్దు. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు పల్లెలు, పట్టణాల్లో ప్రభుత్వ వైద్యశాలలను ఆధునీకరిస్తున్నారు. అవసరమైన చోట కొత్త భవన సముదాయాలు నిర్మిస్తున్నారు. కిడ్నీ బాధితుల కోసం డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. మంత్రి హరీశ్కు కృతజ్ఞతలు.
– రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర
అమిత్షా చెప్పినవన్నీ అబద్ధాలే..
చేవెళ్ల బీజేపీ సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రసంగమంతా ఉట్టి డొల్ల. అబద్ధాల పుట్ట. కేంద్రం నుంచి రాష్ర్టానికి గతేడాది కేవలం రూ.18,220 కోట్లు మాత్రమే నిధులు వచ్చాయి. పార్లమెంట్ సాక్షిగా కేంద్రం నాకు నిధులకు సంబంధించిన కేటాయింపుల నివేదిక నా వద్ద ఉంది. కానీ బీజేపీ నేతలు మాత్రం రూ.1.30 లక్షల కోట్లు ఇచ్చినట్లు అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలు ఏనాడూ పార్లమెంట్లో రాష్ట్ర ప్రజల సమస్యల గురించి పట్టించుకోలేదు. ఇక్కడ అమలవుతున్న సంక్షేమ పథకాలను ప్రస్తావించలేదు. రాష్ర్టాల్లో వెనుకబడిన ఒక్కో జిల్లా అభివృద్ధికి కేంద్రం ఏడాదికి రూ.50 కోట్ల చొప్పున నిధులు కేటాయించాల్సి ఉన్నది. మూడేళ్ల నుంచి రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాలకు రూ.1,350 కోట్ల నిధులు నిలిచిపోయాయి. వాటి గురించి అమిత్ షా మాట్లాడనే లేదు. వాటిపై ఆయన ఎలాంటి హామీ ఇవ్వలేదు. కేవలం మతాల పేరుతో చిచ్చు పెట్టేవిధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి.
– బీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు
‘సీతారామ’తో జిల్లా సస్యశ్యామలం..
హరీశ్రావు మంత్రిగా ఏ శాఖ బాధ్యతలు తీసుకున్నా, ఆ శాఖకు వన్నె తెచ్చేలా పనిచేస్తున్నారు. సీఎం కేసీఆర్ విజన్ను అందిపుచ్చుకుని ముందుకెళ్తున్నారు. రైతుల కోసం సీఎం కేసీఆర్ అనేక ప్రాజెక్ట్లు నిర్మిస్తున్నారు. దీనిలో భాగంగా జిల్లాలో సీతారామ ప్రాజెక్ట్ పనులు సాగుతున్నాయి. ప్రాజెక్ట్ పూర్తయితే ఉమ్మడి జిల్లా సస్యశ్యామలం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్తో రాష్ట్రీయ రహదారులు, పల్లె రహదారుల నిర్మాణం పూర్తయింది. – తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి
విద్వేషాలు రెచ్చగొడుతున్న బీజేపీ
చేవెళ్ల బీజేపీ సభలో ఆ పార్టీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ ప్రజల కోసం ఏం చేస్తారో చెప్పలేదు. పైగా తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ముస్లిం రిజర్వేషన్లను ఎత్తివేస్తామని ప్రకటించడం సిగ్గుచేటు. సోదరభావంతో మెలుగుతున్న ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారు. ఎవరెన్ని మాట్లాడినా రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్దే విజయం. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోవడం ఖాయం.
– రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్