కారేపల్లి, ఆగస్టు 01 : ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా కారేపల్లి మండలం వెంకటీయ్య తండాలో గల గిద్దవారిగూడెం టు అంగన్వాడీ కేంద్రంలో శనివారం బాలింతలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ జర్పుల శాంతి గర్భిణీలు, బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యతను వివరించారు. పుట్టిన వెంటనే శిశువుకు ముర్రుపాలు పట్టించడం ఎంతో అవసరమన్నారు. పుట్టిన తొలి ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని ఆమె సూచించారు. తల్లి పాలలో శిశువు ఎదుగుదలకు అవసరమైన అన్ని పోషకాలు ఉండటంతో పాటు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని వివరించారు.
తల్లిపాలు శిశువుకు తొలి ఆహారం, తొలి టీకా, ప్రకృతి ప్రసాదించిన అమృతమని పేర్కొన్నారు. ఆగస్టు 1 నుంచి 7 వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా దేశ వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. తల్లులు తల్లిపాలపై ఉన్న అపోహలను తొలగించుకోవాలని, శిశువుల ఆరోగ్యవంతమైన భవిష్యత్ కోసం ప్రతి తల్లి తల్లిపాలను తప్పనిసరిగా అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గర్భిణీలు, బాలింతలు, పిల్లల తల్లులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

గిద్దవారిగూడెం టు అంగన్వాడీలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు