భద్రాచలం, ఏప్రిల్ 23 : భద్రాద్రి రామాలయంలో వసంత పక్ష ప్రయుక్త శ్రీరామ నవమి తిరుకల్యాణ నవాహ్నిక బ్రహ్మోత్సవాలు మంగళవారంతో ముగిశాయి. తెల్లవారుజామున 3 గంటలకు స్వామివారికి సుప్రభాతం పలికి.. ఆరాధన, ఆరగింపు, బలిహరణం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. 4 గంటలకు గోదావరి నుంచి తీర్థపు బిందెను మంగళవాయిద్యాల నడుమ తీసుకొచ్చిన తర్వాత స్వామివారిని ప్రత్యేక పల్లకిలో ఆసీనులను చేసి గోదావరి తీరంలోని పునర్వసు మండపం వద్ద 6 గంటలకు వేంచేపు చేసి పంచామృతాలతో స్నపనం జరిపారు. ముందుగా విశ్వక్సేన ఆరాధన, కర్మణః పుణ్యాహవాచనం చేశారు. రోలు, రోకలికి కంకణధారణ చేసి, లక్ష్మి, సరస్వతులను ఆవాహన చేసి పసుపు కొమ్ములు, సుగంధ ద్రవ్యాలు ఉంచి చూర్ణోత్సవం నిర్వహించారు. దీనిని ఉత్సవ పెరుమాళ్లపై ప్రోక్షించారు. ఈ సందర్భంగా స్వామివారి సుదర్శన చక్రానికి గోదావరిలో చక్రస్నానం నిర్వహించారు.
ఈ క్రమంలో పలువురు భక్తులు గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించారు. ఉదయం సార్వభౌమ వాహనంలో స్వామివారికి తిరువీధి సేవ జరిపారు. సాయంత్రం యాగశాలలో పుర్ణాహుతి, వేద విన్నపాలు, అష్టదిక్పాలక బలిహరణం చేపట్టారు. ఆ తర్వాత శేష వాహన సేవ చేసి తర్వాత గరుడ ధ్వజారోహణం చేసి, సంతానం లేని మహిళలకు గరుడ ముద్దలను ప్రసాదంగా పంపిణీ చేశారు. ఆ తదుపరి అష్టదిక్పాలక ఉద్వాసన, పాలికోద్వాసన, అఖండ దీపారాధన ఉద్వాసన జరిపారు. 12 వాయిద్యాలతో మౌనంగా ద్వాదశ ప్రదక్షిణలు, ఆరాధనలు, నిర్వహించి రాత్రికి శ్రీపుష్పయాగం చేశారు. దీంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమయ్యాయి. కాగా.. రాజ దర్బార్ సేవ, నిత్య కల్యాణాలు, ఆర్జిత సేవలను బుధవారం నుంచి ప్రారంభిస్తున్నట్లు దేవస్థానం ఈవో ఎల్.రమాదేవి తెలిపారు.