రఘునాథపాలెం, డిసెంబర్ 7: అప్పటివరకు ఇంటి ముందు ఆడుతూ సందడి చేశాడు. తన అల్లరితో అమ్మను ఊరడించాడు. ఇంతలోనే మృత్యువుకు కన్ను కుట్టిందో ఏమో మూడేళ్ల చిన్నారిని కబళించింది. ఫాగింగ్ రసాయనం తాగి చిన్నారి మృతిచెందిన ఘటన ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం పడమటి తండాలో చోటుచేసుకున్నది. తెలిసిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన భూ క్యా వీరన్న ప్రైవేటు ఎలక్ట్రీషియన్గా చేస్తూ భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు మణికంఠ(3)ను పోషిస్తున్నాడు. వీరన్న అయ్యప్ప మాల ధరించి గ్రామంలోని వేరే ఇంట్లో ఉంటున్నాడు. మంగళవారం మధ్యాహ్నం భార్య ఇంటి పనులు చేసుకుంటుండగా కుమారుడు ఇంటి ఆవరణలో ఆడుకుంటున్నాడు.
ఈ క్రమంలో పక్కనే ఉన్న పంచాయతీ గుమస్తా ఇంటికి వెళ్లాడు. ఇంటి ఎదుట ఫాగింగ్ ద్రావణం ఉన్న సీసాను కూల్డ్రింక్గా భావించి తీసుకున్నాడు. మూత తీసి తాగేశాడు. కాసేపటికి చిన్నారి గట్టిగా కేకలు వేశాడు. గమనించిన తల్లిదండ్రులు పక్కనే బాటిల్ పడిఉండడాన్ని గమనించారు. ఫాగింగ్ రసాయనం తాగినట్లు నిర్ధారణకు వచ్చి ఖమ్మంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు చిన్నారిని వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతిచెందాడు. అప్పటికీ అయ్యప్ప మాలధారణలో ఉన్న తండ్రి వీరన్న దీక్ష విరమించాడు. చిన్నారి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చాడు. విగతజీవుడిగా కనిపించిన కుమారుడిని చూసి తల్లిదండ్రులు విలపించిన తీరు గ్రామస్తులను కంటతడి పెట్టించింది.