గతంలో సమస్యలతో సతమతమైన ఆ పల్లె నేడు అద్దంలా మెరుస్తున్నది. కనీస సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడిన ప్రజలకు ఇప్పుడు సకల సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. గ్రామస్తులు, ప్రజానిధులు, అధికారుల సమన్వయంతో ప్రభుత్వ నిధులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవడంతో గ్రామం ప్రగతిపథంలో పయనిస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘పల్లె ప్రగతి’ కార్యక్రమంతో ఆ పల్లె రూపురేఖలు మారిపోయాయి. అంతేకాదు, అన్ని గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్న ఆ పల్లె.. ఉత్తమ పంచాయతీగా పురస్కారాన్ని సొంతం చేసుకున్నది. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుంది. జరిగిన అభివృద్ధి తెలుసుకోవాలంటే బోనకల్లు మండలంలోని చిరునోముల వెళ్లాల్సిందే.
బోనకల్లు, నవంబర్ 16 : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేసిన పల్లె ప్రగతి కార్యక్రమం ఆ గ్రామ ముఖచిత్రాన్నే మార్చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన నిధులను పంచాయతీ పాలకవర్గం పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకున్నది. గ్రామమంతటికీ మౌలిక సదుపాయాలు కల్పించింది. సిమెంట్, కాంక్రీటు నిర్మాణాలతో గ్రామంలోని అంతర్గత వీధులన్నీ మెరిసిపోతున్నాయి. ఇక పల్లె ప్రకృతి వనం గ్రామస్తులకు ఆహ్లాదాన్ని పంచుతోంది. వైకుంఠధామం నిర్మాణంతో ఆఖరి మజిలీ సమస్యలు తీరిపోయాయి. దీంతో అన్ని గ్రామాలకూ ఆదర్శంగా నిలిచిన ఆ పల్లె.. ఉత్తమ పంచాయతీగా పురస్కారాన్ని సొంతం చేసుకున్నది. అవార్డు అందజేసిన కలెక్టర్.. గ్రామాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన పంచాయతీ పాలకవర్గాన్ని అభినందించారు. ఆ గ్రామమే బోనకల్లు మండలంలోని చిరునోముల. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలన్నీ అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయి.
గ్రామస్తుల ప్రాథమిక అవసరాలను తీరుస్తున్నాయి. పంచాయతీల పాలకవర్గాలు కూడా గ్రామంలో ప్రాధాన్య క్రమంలో అభివృద్ధి పనులు చేపడుతూ వస్తున్నాయి. బోనకల్లు మండలంలోని చిరునోముల గ్రామ పంచాయతీ కూడా ఇదే కోవకు చెందినది. ఈ గ్రామ జనాభా మూడు వేలు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను పాలకవర్గ బాధ్యులు ముందుగానే గుర్తించారు. అందుకు ప్రణాళికలూ సిద్ధం చేసి ఉంచారు. ప్రభుత్వం ఏటా సుమారు రూ.30 లక్షలకుపైగా నిధులు మంజూరు చేస్తుండడంతో గ్రామాభివృద్ధి, మౌలిక సౌకర్యాల కల్పన కోసం వాటిని ప్రాధాన్య క్రమంలో వినియోగించుకుంటున్నారు. రూ.60 లక్షలతో సీసీ రోడ్లు, రూ.11 లక్షలతో వైకుంఠధామం, రూ.2 లక్షలతో డంపింగ్యార్డు నిర్మించారు. 8 ఎకరాల విస్తీర్ణంలో బృహత్ పల్లెప్రకృతివనం, మొక్కల పెంపకానికి నర్సరీ ఏర్పాటు చేశారు.
డ్రైనేజీల్లో క్రమం తప్పకుండా పూడిక తీస్తుండడం, వీధుల్లో రెగ్యులర్గా ఫాగింగ్ చేస్తుండడం, పారిశుధ్య పనులు చేపడుతుండడం వంటి పనులతో దోమల బెడదను పూర్తిస్థాయిలో నివారించారు. ఫలితంగా సీజనల్ వ్యాధుల జాడే లేకుండా పోయింది. కలెక్టర్ కూడా ఈ గ్రామాన్ని పలు సార్లు సందర్శించి పనులను పరిశీలించారు. బృహత్ పల్లెప్రకృతివనం అద్భుతంగా ఉండడంతో సర్పంచ్ ములకారపు రవిని అభినందించారు. రోడ్ల వెంట నాటిన మొక్కలు ఆహ్లాద వాతావరణాన్ని నెలకొల్పుతున్నాయి. మూడేళ్ల కాలంలో గ్రామాన్ని పూర్తిస్థాయిలో మెరుగు పర్చి సుందరంగా తీర్చిదిద్దడంతో పొరుగు గ్రామాలకు ఈ పంచాయతీ ఆదర్శంగా నిలిచింది. దీంతో సర్పంచ్ ములకారపు రవి, పంచాయతీ కార్యదర్శి బంధం అర్జున్లను మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, కలెక్టర్ వీపీ గౌతమ్ అభినందించారు. ఈ మేరకు ఈ ఏడాది ఆగస్టు 15న ఖమ్మంలో ఉత్తమ అవార్డును ప్రదానం చేశారు.
బురద రోడ్లను సీసీలుగా మార్చాం..
గ్రామస్తుల సహకారంతో పంచాయతీని తీర్చిదిద్దినందుకు ఫలితం లభించింది. ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకంటూ పాలకవర్గ సభ్యుల సలహాల మేరకు ప్రాధాన్య క్రమంలో గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టాం. గతంలో బురదమయంగా ఉన్న అంతర్గత రోడ్లను సీసీ రహదారులుగా తీర్చిదిద్దాం. చెరువు పక్కన వైకుంఠధామాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇంకా ఏమైనా సమస్యలుంటే వాటిని గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకుంటాం.
– ములకారపు రవి, సర్పంచ్, చిరునోముల గ్రామం
ప్రతి రోజూ చెత్తను సేకరిస్తాం..
గ్రామంలో ప్రజల అవసరాలను గుర్తించి వాటి తీర్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అంచనాలు, నివేదికలు తయారు చేసి ప్రభుత్వానికి పంపుతున్నాం. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరైన వెంటనే ప్రాధాన్య క్రమంలో అభివృద్ధి పనులు చేపడుతున్నాం. గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దుతున్నాం. ప్రతి రోజూ ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తాం. క్రమం తప్పకుండా పారిశుధ్య పనులను చేపడుతున్నాం. దీంతో ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి.
– బంధం అర్జున్, పంచాయతీ కార్యదర్శి