సారపాక, డిసెంబర్ 14 : ‘అన్ని దానాల్లో కెల్లా రక్తదానం మిన్న..’ అన్నారు పెద్దలు. అందుకే ఎవరైనా ప్రమాదానికి గురైతే వారికి సకాలంలో రక్తం అందించడం అత్యవసంర. ఇలా సకాలంలో రక్తం అందక రోజూ ఎంతోమంది ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. అలాంటి వారిలో కొంతమందికైనా తాము రక్తాన్ని అందించి వారి ప్రాణాలు కాపాడడంతో తమవంతు పాత్ర పోషిస్తున్నారు. బూర్గంపహాడ్ మండలానికి చెందిన రక్తదాతలు. అందులో ముఖ్యుడే పాల సంతోశ్రెడ్డి. బూర్గంపహాడ్ మండలం నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామానికి చెందిన పాల సంతోశ్రెడ్డి ఐటీసీ కాంట్రాక్టు కార్మికుడు. 2016లో తన సోదరికి రక్తం అవసరమైన సమయంలో ఆ బ్లడ్ గ్రూప్ లభించలేదు. అందుకోసం ఎంతో శ్రమపడాల్సి, వేలాది రూపాయలు వెచ్చించాల్సి వచ్చింది. ఆ ఆపద నుంచి సంతోశ్కు ఓ ఆలోచన వచ్చింది. ఇలా ఆసుపత్రుల్లో రక్తం కోసం అత్యవసర సమయాల్లో ఎదురుచూసే వారికి చేయూతగా నిలవాలని నిర్ణయించుకున్నాడు. తనతోపాటు తన టెన్త్క్లాస్ మిత్రులైన 42 మందితో కలిసి ‘భగత్సింగ్ బ్లడ్ డొనేషన్ ఆర్గనైజింగ్ గ్రూపు’ను ఏర్పాటు చేశాడు. దాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు సోషల్ మీడియాను వేదికగా చేసుకున్నారు. అప్పటి నుంచి ఎవరికి రక్తం అవసరమైనా ఒక్క ఫోన్ కాల్తో బాధితుల వద్దకు వెళ్లి రక్తదానం చేయడం ప్రారంభించాడు. ఎందరికో రక్తదాతగా మారారు. ఈ సేవా కార్యక్రమాలకు ఎంతోమంది యువకులు ఆకర్షితులయ్యారు. చాలా మంది ఆ ఆర్గనైజేషన్లో చేరారు. ఇప్పటి వరకూ ఈ గ్రూపులో 220 మంది చేరగా మొత్తం సభ్యుల సంఖ్య 262కు చేరింది. వీరు బాధితుల వద్దకు వెళ్లి స్వచ్ఛందంగా రక్తదానం చేసి ఎంతోమంది ప్రాణాలను కాపాడుతున్నారు. మొత్తం ఇప్పటివరకు గ్రూపు సభ్యులు 1,100 మందికి పైగా రక్తం అందించి వారిని ప్రాణాపాయం నుంచి కాపాడారు. తాము ఎన్నికష్టాలు పడినా ఓ ప్రాణాన్ని కాపాడితే తమకు అదే సంతోషమంటూ నిర్ణయించుకున్న ఆ గ్రూపు సభ్యులు నిరంతరం తమ బాధ్యత నెరవేర్చుతూ సమాజానికి చేయూత అందిస్తూ ముందుకు సాగుతున్నారు.
ఫౌండర్ పాల సంతోశ్రెడ్డి ఇప్పటివరకు 25 సార్లు రక్తదానం చేశాడు. అతడు, అతడి గ్రూపు సభ్యులు కలిసి 1100 మందికి పైగా రక్తం అందించారు. వీరి సేవలను గుర్తించిన ‘ఆట’ సంస్థ బాధ్యులు 2018లో జరిగిన ఆ సంస్థ వేడుకల్లో సీబీఐ పూర్వ జేడీ లక్ష్మీనారాయణ చేతులమీదుగా ఆట పుష్కర అవార్డును ప్రదానం చేశారు. ఆ తర్వాత 2021 ఐటీసీ పీఎస్పీడీ అడ్మిన్ మేనేజర్ చెంగల్రావు నుంచి కూడా అవార్డు అందుకున్నారు. 2023లో ఆ గ్రూపు సభ్యులు 1,000 మందికి రక్తదానం చేసిన సందర్భంగా అప్పటి ఎమ్మెల్యే రేగా కాంతారావు కూడా సంతోశ్, అతడి మిత్రులను సత్కరించారు.
ఆపదలో రక్తం అవసరమై నాలాగా ఎవరూ ఇబ్బంది పడకూడదనేదే మా ఉద్దేశం. అందుకే ఎవరి నుంచీ ఏమీ ఆశించకుండా మేమే స్వచ్ఛందంగా బాధితుల వద్దకు వెళ్లి రక్తం అందిస్తున్నాం. మా గ్రూపులో ఇప్పుడు 262 మంది సభ్యులు ఉన్నారు. జిల్లాలో ఎవరికి రక్తం అవసరమైనా మా గ్రూపు సభ్యులకు ఒక్క ఫోన్ చేస్తే చాలు.. వెంటనే బాధితుల వద్దకు వెళ్లి స్వచ్ఛందంగా రక్తదానం చేసి వారిని కాపాడుతున్నాం. అదే మాకు నిజమైన సంతృప్తి. రక్తం అవసరమైన ఎవరైనా, ఏ సమయంలోనైనా ‘7659892212’ నంబర్కు ఫోన్ చేయొచ్చొ.