‘అభివృద్ధి నిరోధకుడు.. రాజకీయ స్వార్థపరుడు మాజీ ఎంపీ పొంగులేటి.. ఆయనకు వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్తారు.. రంకెలకు కళ్లెం వేస్తారు.. బీఆర్ఎస్కు ప్రజల మద్దతు ఉంది.. పార్టీని గద్దె దించడం కేవలం పగటి కలే. జూన్ 24 నుంచి ప్రభుత్వమే పోడు రైతులకు పట్టాలు ఇవ్వబోతుండగా పొంగులేటి పాదయాత్ర చేయడం విడ్డూరం. కేవలం రైతులను రెచ్చగొట్టేందుకే యాత్రలు.’ అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. భద్రాద్రి జిల్లా పినపాక నియోజకవర్గంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావుతో కలిసి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం ఇల్లెందు పట్టణానికి చేరుకుని ఎమ్మెల్యే హరిప్రియానాయక్ ఆధ్వర్యంలో జేకే కాలనీ సింగరేణి గ్రౌండ్లో నిర్వహించిన పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడారు.
అశ్వాపురం, మే 29: ‘మీ రంకెలకు ప్రజలే కళ్లెం వేస్తారు’ అంటూ మాజీ ఎంపీ పొంగులేటిపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అజయ్కుమార్ మండిపడ్డారు. ‘సీఎం కేసీఆర్ను, బీఆర్ఎస్ను గద్దె దించడం మీ వల్ల కాదని స్పష్టం చేశారు. ప్రజలే సరైన సమయంలో మీకు బుద్ధి చెప్తారని స్పష్టం చేశారు. అశ్వాపురం మండలం నెల్లిపాక పంచాయతీ రాళ్లవాగుపై రూ.1.80 కోట్లతో, తుమ్మలచెరువులోని లోతువాగుపై రూ.5 కోట్లతో, ఇసుకవాగుపై రూ.7 కోట్లతో నిర్మించనున్న హైలెవల్ బ్రిడ్జిల నిర్మాణ పనులకు ప్రభుత్వ విప్ రేగా కాంతారావుతో కలిసి సోమవారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. ‘ఏం చూసుకుని మిడిసిపడుతున్నావ్.. నువ్వు అభివృద్ధి నిరోధకుడివి, నీలాంటి రాజకీయ స్వార్థపరుడికి ప్రజలే సరైన సమయంలో గుణపాఠం చెబుతారు.’ అని స్పష్టం చేశారు. మనసున్న మారాజు సీఎం కేసీఆర్ అని, తెలంగాణ సమాజం అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతో ఏజెన్సీ ప్రాంతాలకూ రూ.కోట్లాది నిధులు మంజూరు చేస్తున్నారని అన్నారు.
అభివృద్ధి మార్క్ చూపుతున్న కేసీఆర్ను గద్దె దించడం మీతరం కాదని స్పష్టం చేశారు. కొందరు నాయకులు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ను వీడారని, అలాంటి వారితో పార్టీకి ఎలాంటి నష్టమూ లేదని అన్నారు. పోడు భూముల హక్కు పత్రాలు, ముద్రణ పూర్తయి పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని అన్నారు. జూన్ 24 నుంచి పంపిణీ చేపట్టనున్నారనే విషయం రాష్ట్ర ప్రజలకు తెలిసినప్పటికీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోడుయాత్ర పేరుతో రైతులను రెచ్చగొడుతున్నారని అన్నారు. అయినా ఆయన మాయమాటలను నమ్మే స్థితిలో ప్రజలు లేరని అన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత మారుమూల గిరిజన గ్రామాలు అద్భుతంగా అభివృద్ధి చెందుతున్నాయని గుర్తుచేశారు.
గత ఎన్నికల నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పోడు హక్కు పత్రాల హామీని నెరవేర్చుతున్నారని అన్నారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా జూన్ 24 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పోడు భూముల హక్కు పత్రాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. జూన్ 2 నుంచి 24 వరకు జరుగనున్న తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పదేళ్లుగా ప్రభుత్వం సాధించిన అభివృద్ధి, సంక్షేమ విజయాలను తెలియపరుస్తూ ప్రజలను చైతన్యం చేయాలని కోరారు.
ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ గిరిజన పక్షపాతిగా నిలిచారని అన్నారు. ఏజెన్సీపై ఆయనకు ఎంతో మమకారం ఉందని అన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి పోడు భూములకు హక్కుపత్రాలు ఇస్తున్నారని అన్నారు. వానకాలం వస్తే అత్యవసర పరిస్థితుల్లో వాగు దాటేందుకు ప్రయత్నించి గత ఏడాది గొందిగూడెం ఇసుకవాగులో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన తనను ఎంతగానో కలిచివేసిందని, ఈ విషయమై మంత్రి పువ్వాడ అజయ్ను అడిగిన వెంటనే అతి ప్రమాదకరమైన ముఖ్యమైన మూడు వాగులకు హైలెవల్ బ్రిడ్జిలు నిర్మించేందుకు నిధులు మంజూరు చేశారని అన్నారు. ఇటీవల తుమ్మల చెరువు, వెంకటాపురం పంచాయతీల పరిధిలో పోడు రైతులకు నెలకొన్న సమస్యను కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లడంతో సీఎంవో నుంచి సంబంధిత అధికారులు వచ్చి జాయింట్ సర్వే చేసి 500 మంది పోడురైతులకు సంబంధించిన సమస్యను పరిష్కరించారని అన్నారు.
కలెక్టర్ను వెంటబెట్టుకు వచ్చి గ్రామసభ నిర్వహించి దరఖాస్తులు తీసుకుని వారికి కూడా జూన్ 24న హక్కుపత్రాలు అందిస్తామని అన్నారు. అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, జడ్పీటీసీ సులక్షణ, వైస్ ఎంపీపీ వీరభద్రం, తహసీల్దార్ రాజు, ఎంపీడీవో వరప్రసాద్, సర్పంచ్లు మడకం సాధు, బండ్ల సంధ్యారాణి, సూరిబాబు, కోడి కృష్ణవేణి, నర్సింహారావు, గొర్రెముచ్చు వెంకటరమణ, పాయం భద్రయ్య, ఎంపీటీసీ పూజిత, జయ, రవిబాబు, అమరేందర్, వెన్న అశోక్కుమార్, గోపిరెడ్డి లక్ష్మారెడ్డి, కృష్ణార్జున్, వెంకటరామయ్య, గాదె వెంకటేశ్వర్లు, అమరపురి శివాజీ, గంగన్న, బొర్రా శ్రీనుబాబు, కొరెం రామారావు, తాటి ఈశ్వరరావు పాల్గొన్నారు.