కొత్తగూడెం అర్బన్, జూన్ 11: మతతత్వ పార్టీలకు రాష్ట్రంలో చోటు లేదని, బీజేపీని ఇక్కడ అడుగుపెట్టనీయమని సీపీఐ జాతీయ నాయకుడు కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రజాగర్జన బహిరంగ సభలో పాల్గొన్న వారు ప్రజలనుద్దేశించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఉద్యమాలకు, కమ్యూనిస్టు పోరాటాలకు పెట్టనికోట అని అన్నారు. 2014లో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చి గద్దెనెక్కిన ప్రధాని మోదీ వాటిని నెరవేర్చకుండా తొమ్మిదేళ్లుగా కార్పొరేట్ మిత్రుల కౌగిలిలో సేదతీరుతున్నాడని అన్నారు. అదానీకి దేశ సంపదను దోచిపెట్టేందుకు ప్రతీ క్షణం పనిచేస్తున్నారని ఆరోపించారు. మోదీనే అసలైన ఆర్థిక నేరస్తుడని, రూ.1.50లక్షల కోట్లు కార్పొరేట్లకు రాయితీలను నిచ్చి పేదలపై మోయలేని భారం మోపుతున్నాడని విమర్శించారు.
బ్లాక్మెయిలింగ్, బెదిరింపులకు పాల్పడుతూ సీబీఐ, ఈడీల వ్యవస్థలను తన గుప్పిట్లో పెట్టుకొని ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తున్నారని, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. కర్ణాటకలో గల్లీగల్లీ, వీధివీధి తిరుగుతూ పొర్లు దండాలు పెట్టినా అక్కడ బీజేపీ విధానాలు నచ్చక ప్రభుత్వాన్ని సాగనంపారని, రాబోయే రోజుల్లో ఇవే ఫలితాలు పునరావృతం అవుతాయని జోస్యం చెప్పారు. మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధిస్తున్నా ఆ పార్టీ నాయకులకు వత్తాసు పలుకుతూ మహిళల ఆవేదనను పట్టించుకోకుండా బెదిరింపులకు పాల్పడటం సిగ్గుచేటన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా అన్ని శక్తులు ఏకమవ్వాల్సిన అవసరం ఉన్నదని, బీజేపీని ఓడించేందుకు ఎవరికైనా మద్దతిస్తామన్నారు. రాక్షస పార్టీని అంతమొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని, కమ్యూనిస్టుల పని అయిపోయిందని అవాకులు చెవాకులు పేలుతున్నారన్నారు.
ఒక్కసారి కొత్తగూడెం వచ్చి చూస్తే కమ్యూనిస్టుల బలం ఏమిటో తెలుస్తుందని చురకలంటించారు. సీఎం కేసీఆర్ బీజేపీకి వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేస్తున్నారని, ఆయనకు అందుకే మద్దతునిస్తున్నామన్నారు. ఏపీ సీఎం జగన్ కట్టుబానిసలా ఉన్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ అన్ని వర్గాల పట్ల తండ్రి పాత్ర పోషించాల్సిన అవసరం ఉన్నదని, ప్రజా సమస్యలను విని పరిష్కరించేందుకు కృష్టి చేయాలని వేదిక నుంచి కోరారు. అనంతరం పలు తీర్మానాలు, డిమాండ్లను ప్రవేశపెట్టగా.. ప్రజలు ఆమోదించారు. సభలో సీపీఐ జిల్లా కార్యదర్శి షేక్ సాబీర్పాషా, రాష్ట్ర నాయకులు మనీష్ కుంజం, చాడ వెంకటరెడ్డి, పల్లా వెంకటరెడ్డి, భాగం హేమంతరావు, పశ్య పద్మ, అయోధ్య, వాసిరెడ్డి సీతారామయ్య, తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు, వివిధ జిల్లాల కార్యదర్శులు, జిల్లా, మండల, పట్టణ కార్యదర్శులు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఎరుపెక్కిన గూడెం వీధులు
సీపీఐ ప్రజాగర్జన సభతో కొత్తగూడెం పట్టణ పురవీధులు ఎర్రజెండాలతో ఎరుపెక్కాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తలు ఎక్కువగా ఎర్రచొక్కాలను ధరించి పార్టీపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. మండుటెండను లెక్క చేయకుండా మధ్యాహ్నం నుంచే ప్రకాశం స్టేడియంకు చేరుకోవడంతో పండుగ వాతావరణం నెలకొంది. తొలుత రైల్వేస్టేషన్ నుంచి బస్టాండ్, పోస్టాఫీస్ మీదుగా సీపీఐ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు.