మధిర, సెప్టెంబర్ 16: సమైక్యభావమే తెలంగాణ విధానమని ఖమ్మం ఎంపీ, టీఆర్ఎస్ లోక్సభా పక్ష నేత నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఇందుకోసమే సీఎం కేసీఆర్ తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలకు పిలుపునిచ్చారని అన్నారు. వజ్రోత్సవాల సందర్భంగా శుక్రవారం మధిర మార్కెట్ యార్డులో నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. రాష్ట్రంలో మతవిద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయాలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. తెలంగాణలో ప్రజలంతా సమైక్యభావంతో ఉండాలనేదే సీఎం కేసీఆర్ ఆలోచన అని అన్నారు. ఇందుకోసమే తెలంగాణ జాతీయ సమైక్యతా ఉత్సవాలకు ఆయన శ్రీకారం చుట్టారని అన్నారు. మతోన్మాద శక్తులకు తెలంగాణలో చోటులేదని స్పష్టం చేశారు. అహింసా పద్ధతిలోనే సీఎం కేసీఆర్ తెలంగాణను సాధించారని గుర్తుచేశారు.
అనంతరం రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క కూడా మాట్లాడారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, టీఆర్ఎస్ నాయకులు మొండితోక లత, నల్లమల వెంకటేశ్వరరావు, చిత్తారు నాగేశ్వరరావు, మెండెం లలిత, దేవరకొండ శిరీష, కోపూరి పూర్ణయ్య, సామినేని హరిప్రసాద్, శీలం కవిత, పర్సగాని తిరుపతి కిశోర్, రవీంద్రనాథ్, బొమ్మెర రామ్మూర్తి, సుభాశ్చంద్రబోస్, రాంబాబు, రాధిక, శిరీష, మంగీలాల్, విజయభాస్కర్రెడ్డి, బోడేపూడి వేణుమాధవ్ తదితరులు పాల్గొన్నారు.
మధిరలో మువ్వన్నెల రెపరెపలు..
మధిరలో శుక్రవారం మువ్వన్నెల పతాకాలు రెపరెపలాడాయి. వజ్రోత్సవాల సందర్భంగా నియోజకవర్గంలోని బోనకల్లు, చింతకాని, ముదిగొండ, మధిర, ఎర్రుపాలెం మండలాల నుంచి 15 వేల మందికి పైగా ప్రజలు మధిర చేరుకున్నారు. వైఎస్ఆర్ సెంటర్ నుంచి ఆర్వోబీ బ్రిడ్జి, అంబేద్కర్ సెంటర్ మీదుగా మార్కెట్యార్డుకు చేరుకొని బహిరంగ సభలో పాల్గొన్నారు.