ఆడపిల్ల పుడితే ఇంటికి మహాలక్ష్మి వచ్చిందంటారు. చిన్నారి కాళ్లకు పట్టీలు ధరించి ఇల్లంతా కలియదిరుగుతుంటే ఘల్లు ఘల్లుమంటూ వచ్చే శబ్దానికి తెగ సంబురపడుతుంటారు. కానీ, బాలికకు మైనార్టీ తీరక ముందే తల్లిదండ్రులు పెళ్లి చేసి భారం తగ్గించుకోవాలని భావిస్తున్నారు. అభం శుభం తెలియని చిన్నారులను ‘మూడు ముళ్ల’ బంధంతో వారిని బంధిస్తున్నారు. అందుకే, తల్లిదండ్రులారా! ఒక్కక్షణం ఆలోచించండి.. ఆడపిల్లలు భారం కాదు.. భవితకు ఆధారం అనే విషయాన్ని గుర్తించండి. వారి స్వేచ్ఛనివ్వండి.. ఉన్నత చదువులు చదివించండి. ఉద్యోగాలు చేయించండి. చిన్న వయస్సులోనే పెండ్లి చేసి జీవితాలను నాశనం చేయకండి.
రాష్ట్ర ప్రభుత్వం బాల్యవివాహాల నిర్మూలనకు నడుం బిగించింది. బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేసేందుకు సమీకృత బాలల అభివృద్ధి, సంరక్షణ సంస్థ (ఐసీపీఎస్, ఐసీడీఎస్) ద్వారా వివిధ కార్యక్రమాలు చేపడుతున్నది. ప్రత్యేకంగా హెల్ప్లైన్ నంబర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. బాల్యవివాహం జరుగుతుందని సమాచారం అందిన వెంటనే అధికారులు అక్కడికి వెళ్లి వివాహాన్ని అడ్డుకుంటున్నారు. అమ్మాయి, అబ్బాయితో పాటు వారి తల్లిదండ్రులు, బంధువులకు బాల్యవివాహాలతో కలిగే నష్టాలను వివరిస్తున్నారు. వివాహం తర్వాత అమ్మాయిలకు తలెత్తే ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పిస్తున్నారు. గడిచిన ఆరేళ్లలో భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా 118 వివాహాలను నిలిపివేశారు. ఆడపిల్లల కోసం ప్రభుత్వ అనేక పథకాలు అమలు చేస్తున్నదని తెలియజేస్తున్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని తల్లిదండ్రులకు సూచిస్తున్నారు.
– భద్రాద్రి కొత్తగూడెం, మే 7 (నమస్తే తెలంగాణ)
భద్రాద్రి కొత్తగూడెం, మే 7 (నమస్తే తెలంగాణ) : చిన్నారులకు రహస్యంగా వివాహాలు జరుగుతున్నాయి. అభం శుభం తెలియని బాలికలకు వారి తల్లిదండ్రులు వివాహ బంధనాలు వేస్తున్నారు. అవగాహన రాహిత్యం, సమాజంలో జరుగుతున్న ఆకర్షణ/ప్రేమలను తట్టుకోలేక వివాహ వయసు రాక ముందే బాలికలకు పెళ్లి చేసి భారం తీర్చుకుంటున్నామనుకుంటున్నారు. అక్కడక్కడా జరుగుతున్న ఇలాంటి వివాహాలకు అడ్డుకట్ట వేసేందుకు సమీకృత బాలల అభివృద్ధి, సంరక్షణ సంస్థల (ఐసీపీఎస్, ఐసీడీఎస్) అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి.
గ్రామస్థాయిలో అంగన్వాడీ టీచర్లు, హెల్ప్లైన్ నంబర్ల పుణ్యమా అంటూ ప్రేమ పెళ్లిళ్లు, బాల్య వివాహాల సమాచారం పక్కాగా అందుతోంది. దీంతో ముందస్తుగానే పెళ్లిళ్లను నిలిపివేస్తున్నారు. గడిచిన ఆరేళ్లలో భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా 118 వివాహాలను ఆ శాఖ అధికారులు నిలిపివేశారు. పెళ్లి, సంసారం అనే పదాలకు అర్థాలు కూడా తెలియని బాల్యాన్ని తల్లిదండ్రులు ఛిద్రం చేస్తున్నారు. ప్రేమ పెళ్లిళ్లు తలవంపులు తెచ్చిపెడతాయనో, ఆడపిల్ల ఇంటికి భారమనో అనుకుంటున్నారు గామీణ, పట్టణ శివారు ప్రాంతాల తల్లిదండ్రులు. ‘పెళ్లి చేస్తే భారం తీరిపోతుందిగా..’ అనుకుంటూ పెళ్లి తంతు కానిచ్చేస్తున్నారు.
బాలికల వివాహ వయసు 18, బాలుర వివాహ వయసు 21 ఏళ్లుగా ఉన్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో వీటినెవరూ పట్టించుకోవడం లేదు. సంబంధాలు కుదుర్చుకొని బాల్యంలోనే వివాహాలు జరిపిస్తున్నారు. చాలాచోట్ల ఈ వివాహాల సమాచారం ఐసీపీఎస్కు రావడంతో అధికారులు, సిబ్బంది వెళ్లి నిలిపిస్తున్నారు. ఆడపిల్ల ఎప్పటికీ భారం కాదని అవగాహన కల్పిస్తున్నారు. అయినా కొంతమంది తల్లిదండ్రులు అక్కడక్కడా వాటిని పెడచెవిన పెడుతూనే ఉన్నారు.
బాల్య వివాహాన్ని ఎంత రహస్యంగా చేయాలకున్నా.. ఎవరో ఒకరి నుంచి కాల్ సెంటర్కు ఫోన్లు వెళ్తూనే ఉన్నాయి. దీంతో చాలా వరకు బాల్యవివాహాలను నిలిపివేస్తున్నారు. స్థానికంగా అంగన్వాడీ టీచర్ కీలకంగా ఉండడంతో పక్కా సమాచారం జిల్లా అధికారులకు చేరుతోంది. దీంతో పెళ్లికి మంతనాలు జరుగుతున్న సమయంలో కాల్ సెంటర్కు ఫోన్ వెళ్తోంది. ఐసీడీఎస్, ఐసీపీఎస్ అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని తల్లిదండ్రులు, బాలికలకు కౌన్సెలింగ్ ఇచ్చి వివాహాన్ని వాయిదా వేయిస్తున్నారు. తమ కుమార్తెకు వివాహ వయసు వచ్చాకే వివాహం చేస్తామంటూ పోలీసుల సమక్షంలో తల్లిదండ్రుల నుంచి హామీపత్రం తీసుకుంటున్నారు.
బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాల గురించి కూడా తల్లిదండ్రులకు తెలియజేస్తున్నారు. యుక్తవయసులో శరీరంలో మార్పులు వచ్చినా అర్థం చేసుకునే పరిపక్వత బాలికలకు ఉండదని, లేత వయసులో గర్భం దాల్చడం వల్ల ఆమె ఆరోగ్యానికి హానికరమని అవగాహన కల్పిస్తున్నారు.
బాల్య వివాహం జరగబోతుందని ఫోన్ కాల్ వస్తే చాలు.. క్షణాల్లో అక్కడికి చేరుకుంటున్నాం. తల్లిదండ్రులకు, బాలికలకు అవగాహన కల్పించి వివాహాలను వాయిదా వేయిస్తున్నాం. వివాహ వయసు వచ్చాకే పెళ్లి జరిపించేలా హామీ పత్రం రాయించుకొని పోలీసు స్టేషన్లలో అప్పగిస్తున్నాం. డీసీపీవో, ఐసీడీఎస్ సూపర్వైజర్, అంగన్వాడీ టీచర్, పోలీస్, రెవెన్యూ అధికారులతోలిసి కౌన్సెలింగ్ ఇస్తున్నాం. గడిచిన ఆరేళ్లలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 118 బాల్య వివాహాలను నిలిపివేశాం. -యశోద, ఐసీపీఎస్ కౌన్సెలర్, కొత్తగూడెం
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో చాలా వరకు బాల్య వివాహాలు తగ్గుముఖం పట్టాయి. వధూవరులకు వివాహ వయసు లేకుంటే ఈ పథకం వర్తించకపోవడంతో ఆ వయసు వచ్చేదాకా వేచి ఉంటున్నారు. ఆ తరువాతే వివాహాలు జరిపిస్తుండడంతో ప్రభుత్వం నుంచి వచ్చే ఆ సాయం తల్లిదండ్రులకు అందుతోంది. వారికి ఆర్థిక భారమూ తప్పుతోంది.