భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/కొత్తగూడెం అర్బన్, ఏప్రిల్ 19 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో ఎండలు దంచికొడుతున్నాయి. గడిచిన పది రోజులుగా ఏ గ్రామంలో పరిశీలించినా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పల్లె, పట్నం అనే తేడా లేకుండా ఎక్కడ గమనించినా 42 డిగ్రీలకు తక్కువగా నమోదు కావడం లేదు. కొత్తగూడెం, సుజాతనగర్ లాంటి మండలాలను పరిశీలిస్తే అత్యధికంగా 44.8 డిగ్రీల సెల్సీయస్ చొప్పున రికార్డు స్థాయిలో నమోదవుతోంది. మున్ముం దు ఎండలు ఇంకాస్త ముదిరితే ఉష్ణోగ్రతలు ఇంకెన్ని డిగ్రీలకు ఎగబాకుతాయోననే ఆందోళన వ్యక్తమవుతోంది.
‘వామ్మో ఇవేం ఎండలురా నాయనా.. మునుపెన్నడూ మచ్చుకైనా చూడలేదురా ఇంతటి ఎండలు..’ అంటున్నారు పల్లెల్లోని వృద్ధులు. ఉదయం పది గంటల సమయం దాటిందంటే చాలు.. వారు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మధ్య వయస్కులు, మిగతా వారి పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. ఉదయం పది దాటాక ఏదైనా పనిమీద బయటకు వెళ్లాలంటే జంకాల్సిన పరిస్థితి. అత్యవసరమై అడుగు బయటపెట్టినా అల్లాడిపోవడం అనివార్యమవుతుందంటే అతిశయోక్తిగా అనిపించడమే లేదు.
గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా పది రోజుల ఉష్ణోగ్రతలు గమనిస్తే ఎక్కడ కూడా 42 డిగ్రీలకు పైగానే నమోదవుతోంది. భద్రాద్రి జిల్లాలో అత్యధికంగా కొత్తగూడెం పట్టణం, సుజాతనగర్ మండలంలో 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. భద్రాచలం, చుంచుపల్లి, చండ్రుగొండ మండలాల్లో 43 డిగ్రీల వరకు నమోదవుతోంది. మిగతా గ్రామాల్లో సైతం అంతక్రితం 40 డిగ్రీలకు పైగానే నమోదైంది. ఉదయం పది గంటలు దాటాక వినియోగదారుల తాకిడి తక్కువవుతోంది. దీంతో పట్టణాల్లోని దుకాణదారులు కూడా తమ షాపులకు వస్ర్తాలతో ముసుగులు వేస్తున్నారు. అప్పటికే ఎండ వేడిమి పెరగడం ప్రారంభమవుతుండడంతో వారు కూడా షాపుల్లోనే కూలర్లను, ఏసీలను ఏర్పాటు చేసుకొని అక్కడే సేదదీరుతున్నారు. ఇక అత్యవసరమై బయటకు వచ్చిన వాళ్లు మాత్రం నిప్పులు చెరిగే ఎండలోనూ పనులు పూర్తిచేసుకుంటున్నారు.
రోజువారీ కూలి పనులు చేసుకొని జీవించే వారు కూడా ఉదయాన్నే 6 గంటలకు పనులకు వెళ్లి మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి ఇళ్లకు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో వారు ఒక వైపు ఎండతో, మరోవైపు దాహంతో అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో చల్లని నీళ్లను, శీతల పానీయాలను ఆశ్రయిస్తున్నారు. ఇక ఇటుక బట్టీల వంటి అధిక వేడిమి ఉండే ప్రాంతాల్లో పనులు చేసే వలస కార్మికులు మాత్రం ఎండకు మగ్గిపోతున్నారు. నెత్తిన తెల్లని వస్త్రం కప్పుకున్నా వడగాడ్పులను అది తాళలేకపోతుంది. ఏప్రిల్ మూడో వారంలోనే ఎండలు ఇలా ఉంటే.. ఇక రానున్న నెల రోజుల్లో పరిస్థితి ఇంకెంత ఆందోళనకరంగా ఉంటుందోనంటూ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఎండలు ఇలాగే కొనసాగితే వడదెబ్బలు మరింత పెరిగే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఎండలు పెరుగుతున్న వేళ ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక, జిల్లా వైద్యాధికారులు ఇటీవలే జిల్లా ప్రజలకు పలు సూచనలు చేశారు.