భద్రాచలం, జనవరి 30: దక్షిణాఫ్రికాలో ఇటీవల జరిగిన టీ-20 మహిళల ప్రపంచ కప్ పోటీల్లో సత్తా చాటింది భద్రాచలం పట్టణానికి చెందిన యువతి గొంగడి త్రిష. దీంతో ఈమెను పలువురు పట్టణ ప్రముఖులు అభినందిస్తున్నారు. నెహ్రూకప్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వాహకులు బాలయోగి, వాతాడి దుర్గా అశోక్ ప్రత్యేకంగా అభినందించారు. భద్రాచలంలో సోమవారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. పట్టణానికి చెందిన త్రిష ప్రపంచంలోనే నెంబర్ వన్ మహిళా క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకోవడం సంతోషకరమని అన్నారు. ఇది ఒక్క భద్రాచలం పట్టణానికేగాక తెలంగాణ రాష్ర్టానికి, యావత్ దేశానికే గర్వకారణమని అన్నారు. త్రిష ఇండియాకు వచ్చాక భద్రాచలం పట్టణంలో ఆమెకు అభినందన సభ ఏర్పాటు చేస్తామని తెలిపారు.
త్రిష తండ్రి రామిరెడ్డి చిన్నప్పటి నుంచే ఆమెకు క్రికెట్పై ఉన్న మక్కువ గమనించి తన కుమార్తెను హైదరాబాద్ తీసుకెళ్లి అక్కడే క్రికెట్లో శిక్షణ ఇప్పించారని గుర్తుచేశారు. ఇప్పుడు త్రిష బాల్తో, బ్యాట్తో అద్భుతాలు సృష్టిస్తోందని, ఆల్ రౌండ్ ప్రతిభతో రాణిస్తోందని అన్నారు. ఆదివారం జరిగిన ఫైనల్స్లో ఇంగ్లండ్ జట్టును 68 పరుగులకే భారత జట్టు ఆలౌట్ చేసిందని అన్నారు. అనంతరం లక్ష్యఛేదనలో బ్యాటింగ్కు దిగిన త్రిష 24 పరుగులు సాధించి, కీలక భాగస్వామ్యాలను నమోదు చేసి అండర్ -19 వరల్డ్ కప్ను దేశానికి అందించిందన్నారు. అంతేగాక ఉమెన్ ఆఫ్ ద సిరీస్గా నిలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ను క్యాచ్ ద్వారా అవుట్ చేసి మ్యాచ్ను మలుపు తిప్పిందని తెలిపారు. అండర్-19లో సెలెక్ట్ అవడం, శ్రీలంక, వెస్టిండీస్, న్యూజీలాండ్ సిరీస్లలో రాణించడం త్రిషకు ఫ్లస్ పాయింట్ అయిందని, దీంతో ఆమెను అండర్-19 వరల్డ్ కప్కు ఎంపిక చేయడం, ఆడిన తొలి మ్యాచ్లోనే అద్భుత ప్రదర్శన చూపడం ఆమె ప్రతిభకు తార్కాణమని అన్నారు. అట్లూరి శ్రీధర్, శ్రీనివాసరాజు, ఎస్కే సలీం, సదానందం, నాగార్జున, గుమ్మూలూరి శ్రీనివాస్ పాల్గొన్నారు.