భద్రాద్రి కొత్తగూడెం, మే 29 (నమస్తే తెలంగాణ) : వానకాలం పంటలకు అన్నిరకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ ప్రియాంక ఆల తెలిపారు. బుధవారం ఐడీఓసీలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రైతులు ఏ పంటలు వేసినా సరిపడా విత్తనాలు వ్యవసాయశాఖ సిద్ధం చేసిందన్నారు. డీలర్లు ఇప్పటికే విక్రయాలు చేస్తున్నారని అన్నారు. అధిక ధరలకు విక్రయించినా, స్టాక్లేదని రైతుల్ని ఇబ్బందిపెట్టినా లైసెన్స్లు రద్దు చేస్తామని హెచ్చరించారు. టాస్క్ఫోర్స్ టీం నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నదని తెలిపారు.
2,47,044 పత్తి విత్తన ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. అందులో 29,130 ప్యాకెట్లు ఇప్పటికే విక్రయాలు చేశారని తెలిపారు. వర్షాలు వచ్చాకే పత్తి విత్తనాలు విత్తాలని సూచించారు. వరి, మిర్చి, మొక్కజొన్న విత్తనాలు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. జీలుగు, జనుము, పిల్లిపెసర విత్తనాలు విక్రయాలు చేయడం జరిగిందన్నారు. విత్తనాల కోసం రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. డీలర్లు ఇబ్బందులు పెడితే వెంటనే సమాచారం ఇవ్వాలన్నారు. అన్ని మండలాల్లో విత్తన సదస్సులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రాసీగోల్డ్ సీడ్ విత్తనాలు కూడా 50వేల ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. డీలర్లకు కూడా అవగాహన కల్పించామన్నారు. రైతులను ఇబ్బంది పడినట్లు సమాచారం వస్తే డీలర్లపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో డీఏవో బాబూరావు, ఏడీలు రవికుమార్, లాల్చంద్, ఏవోలు పాల్గొన్నారు.