ఖమ్మం, జూలై 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): భద్రాచలం వద్ద గోదావరి వరద నీటిమట్టం శనివారం ఉదయానికి మరింత పెరిగే ప్రమాదం ఉందని భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక తెలిపారు. ఎగువ నుంచి వరదనీరు పెద్ద ఎత్తున గోదావరిలోకి వస్తుండడంతో శుక్రవారం రాత్రి వరకు భద్రాచలం వద్ద గోదావరి 52 అడుగులకు చేరిందని, రాత్రి 9 గంటలకు 53.10 అడుగులకు చేరడంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశామని తెలిపారు. భద్రాద్రి జిల్లాలో వరదల పరిస్థితి, సహాయక చర్యలపై భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. 58 అడుగుల వరకు గోదావరి చేరుకున్నా ప్రజలకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
మూడో ప్రమాద హెచ్చరిక జారీ అయితే సురక్షిత ప్రాంతాలకు తరలించే గ్రామాలను సైతం గుర్తించామని, అక్కడి ప్రజలను అప్రమత్తం చేశామని అన్నారు. రెండో ప్రమాద హెచ్చరిక అమలులో ఉన్నంతవరకు ప్రజా రవాణాకు ఇబ్బంది కలగలేదని, 53 అడుగులపైన వరద పెరుగుతుండడంతో దుమ్ముగూడెం మండలం తూరుబాక వద్ద రాష్ట్రీయ రహదారిపై వరదనీరు ప్రవహిస్తోందని అన్నారు. దీంతో అక్కడ రాకపోకలకు అంతరాయం కలిగిందన్నారు. అత్యవసర సేవల కోసం ప్రభుత్వం హెలీకాప్టర్ను పంపించిందని, వైమానిక దళ సిబ్బంది సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఎగువనుంచి 16 లక్షల క్యూసెక్కుల నీరు గోదావరిలోకి చేరుతోందని, దీంతో వరద మరింత పెరిగే ప్రమాదం ఉందని అన్నారు.