భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): మిచౌంగ్ తుపాన్ ప్రభావం వల్ల కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అన్నిశాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల ఆదేశించారు. మంగళవారం ఉదయం అన్నిశాఖల జిల్లా అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగు చర్యలు చేపట్టాలని, గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. విపత్తు దృష్ట్యా సిబ్బందికి అన్నిరకాల సెలవులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. సెలవులో వెళ్లిన సిబ్బంది తక్షణమే విధులకు హాజరుకావాలని, ముంపునకు గురయ్యే లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా చేయాలన్నారు. పశువులను మేతకు వదలకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉంచాలని, వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లే అవకాశం ఉన్నందున అలాంటి ప్రాంతాల్లో రాకపోకల నియంత్రణకు బారికేడింగ్ ఏర్పాటు చేయాలన్నారు.
చెరువులను పరిశీలించి తెగే అవకాశం ఉన్నచోట చర్యలు చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఇసుక బస్తాలను అందుబాటులో ఉంచాలని, గ్రామాలు, మున్సిపాలిటీల్లో శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివాసం ఉంటున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. వంగిన, విరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలను పరిశీలించి చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు, అంగన్వాడీ కేంద్రాలకు బుధవారం కూడా సెలవు ప్రకటించినట్లు చెప్పారు. సంక్షేమశాఖల వసతిగృహాల్లో ఉండే విద్యార్థులను హాస్టల్ విడిచి బయటకు వెళ్లకుండా నియంత్రణ పాటించాలన్నారు.
అత్యవసర సేవల కోసం కాల్ సెంటర్లకు ఫోన్ చేయాలని ప్రజలకు సూచించారు. ధాన్యం వర్షాలకు తడవకుండా టార్పాలిన్లు సరఫరా చేయాలని, కొనుగోలు చేసిన ధాన్యం తడవకుండా సమీపంలోని గోదాముల్లో భద్రపర్చాలన్నారు. ముంపు తగ్గే వరకు వరికోతలు కోయొద్దని రైతులకు సూచించారు. గ్రామ, మండల స్థాయిలో వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ టెలీకాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్లు రాంబాబు, మధుసూదన్రాజు, డీపీవో రమాకాంత్, సీఈవో విద్యాలత, డీఈవో వెంకటేశ్వరచారి, డీఎంహెచ్వో శిరీష, మహిళా శిశు సంక్షేమ అధికారి విజేత, ఇరిగేషన్ అధికారులు వెంకటేశ్వరరెడ్డి, అర్జున్, డీఆర్వో రవీంద్రనాథ్, ఆర్డీవోలు శిరీష, మంగీలాల్, మున్సిపల్ కమిషనర్లు, అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.
తుపాన్ దృష్ట్యా మరో రెండు రోజులు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులందరూ క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని అదనపు కలెక్టర్ రాంబాబు సూచించారు. తుపాన్ ప్రభావం వల్ల చేపట్టాల్సిన చర్యలపై ఆయా శాఖల అధికారులతో ఐడీవోసీ మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా రైతుల సమస్యలపై ప్రధానంగా దృష్టిసారించి వారికి సలహాలు సూచనలు ఇవ్వాలని సూచించారు.
ఖమ్మం ఎడ్యుకేషన్/ కొత్తగూడెం ఎడ్యుకేషన్, డిసెంబర్ 5: మిచౌంగ్ తుఫాన్ దృష్ట్యా మరో రెండు రోజులపాటు భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో రెండో రోజు బుధవారం కూడా అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్లు ఖమ్మం, భద్రాద్రి కలెక్టర్లు వీపీ గౌతమ్, ప్రియాంక ఆల మంగళవారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. వసతి గృహాల్లో ఉండే విద్యార్థులు హాస్టళ్లను విడిచి బయటకు వెళ్లకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
రఘునాథపాలెం, డిసెంబర్ 5: తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమును ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ మంగళవారం పరిశీలించారు. జిల్లాలోని వర్ష ప్రభావ పరిస్థితుల గురించి పర్యవేక్షించారు.