మూడు రోజులుగా ముసురు వీడడం లేదు. జనం ఇల్లు విడిచి బయటకు రావడం లేదు. రైతులు మాత్రం సంబురంగా సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. ఉమ్మడి జిల్లాలో కురుస్తున్న వర్షాలకు ఎగువ నుంచి వస్తున్న వరద తోడయ్యింది. ప్రాజెక్టులు జలకళను సంతరించుకోగా.. వాగులు, వంకలు కొత్త నీటితో ప్రవహిస్తుండగా.. చెరువులు అలుగు పోస్తున్నాయి. గురువారం భద్రాచలం వద్ద గోదావరి 44 అడుగులకు చేరుకోవడంతో కలెక్టర్ ప్రియాంక ఆల మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ముంపు ప్రాంతాల్లో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పర్యటించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. కిన్నెరసాని జలాశయం, తాలిపేరు ప్రాజెక్టు, పాలేరు, వైరా రిజర్వాయర్లు, లంకపల్లి, బేతుపల్లి చెరువులు జలకళను సంతరించుకున్నాయి. ఖమ్మం జిల్లావ్యాప్తంగా సగటున 20.9 మి.మీ వర్షపాతం నమోదు కాగా.. భద్రాద్రి జిల్లావ్యాప్తంగా సగటున 43 మి.మీ వర్షపాతం నమోదైంది.
– ఖమ్మం, జూలై 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/భద్రాద్రి కొత్తగూడెం, (నమస్తే తెలంగాణ)
ఖమ్మం, జూలై 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/భద్రాద్రి కొత్తగూడెం (నమస్తే తెలంగాణ): ఉమ్మడి ఖమ్మం జిల్లాను ముసురు వదలడం లేదు. మూడు రోజుల నుంచి వర్షం కురుస్తూనే ఉంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు భద్రాచలంలోని గోదావరి నీటిమట్టం గంట గంటకూ పెరుగుతున్నది. ఇప్పటికే పట్టణంలోని సీతారామచంద్రస్వామి ఆలయ పరిసరాల్లోకి వరద నీరు చేరింది. విస్తా కాంప్లెక్స్ వద్ద ఉన్న స్లూయిస్లో పట్టణం నుంచి వచ్చే మురుగు, వర్షపు నీటిని తోడేందుకు అధికారులు ఐదు భారీ మోటర్లు ఏర్పాటు చేశారు. గురువారం ఉదయం 7 గంటలకు 39.10 అడుగుల వద్ద ఉన్న గోదావరి ప్రవాహం సరిగ్గా మధ్యాహ్నం 3.19 గంటలకు 43 అడుగులకు చేరుకున్నది. దీంతో కలెక్టర్ ప్రియాంక ఆల మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ముంపు ప్రాంతాలకు చెందిన అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని విజ్ఞప్తి చేశారు. వరద సహాయక చర్యల కోసం భద్రాచలం సబ్కలెక్టర్ కార్యాలయం (ఫోన్ నెంబర్ 08743- 232444), కొత్తగూడెం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్స్ (ఫోన్ నంబర్- 08744-241950)ను ఏర్పాటు చేశారు. గోదావరిలో వరద ప్రవాహం మరింత పెరగవచ్చని సీడబ్ల్యూసీ అధికారులు అంచనా వేస్తున్నారు. పినపాక నియోజకవర్గంలోని ముంపు ప్రాంతాల్లో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఏఎస్పీ పరితోశ్ పంకజ్ పర్యటించారు. దుమ్ముగూడెం మండలం పర్ణశాల సమీపంలోని వాగు పొంగి సీతమ్మ నార చీరెల ప్రాంతం నీట మునిగింది.
వర్షపాతం ఇలా..
గడిచిన 24 గంటల్లో (బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు) ఖమ్మం జిల్లావ్యాప్తంగా సగటున 20.9 మి.మీ వర్షపాతం నమోదు కాగా అత్యధికంగా కామేపల్లి మండలంలో 49.6 మి.మీ నమోదైంది. ఏన్కూరు మండలంలో 40.2 మి.మీ, కారేపల్లి 39.4 మి.మీ, తల్లాడ 28.4 మి.మీ, సత్తుపల్లి 24.4 మి.మీ, కల్లూరు 28.4 మి.మీ, రఘునాథపాలెం 25 మి.మీ, కూసుమంచి మండలంలో 23 మి.మీ.. మిగిలిన మండలాల్లో 10-20 మి.మీ వర్షపాతం నమోదైంది. తిరుమలాయపాలెం మండల పరిధిలోని ఒక్క బచ్చోడు గ్రామంలోనే 37.8 మి.మీ వర్షపాతం నమోదైంది. భద్రాద్రి జిల్లావ్యాప్తంగా సగటున 43 మీ.మీ వర్షపాతం నమోదు కాగా అత్యధికంగా చర్ల మండలంలో 100 మి.మీ నమోదైంది. భద్రాచలం మండలంలో 93 మి.మీ, ఆళ్లపల్లి మండలం 73 మి.మీ, దమ్మపేట 62 మి.మీ, బూర్గంపాడు 61 మి.మీ, దుమ్ముగూడెం 55 మి.మీ, ఇల్లెందు మండలంలో 45 మి.మీ వర్షపాతం నమోదైంది. గుండాల మండలం కొడవటంచ కిన్నెరసానివాగు, అన్నపురెడ్డిపల్లి మండలం కట్టుగూడెంవాగు పొంగి ప్రవహిస్తున్నాయి. పలు గ్రామాల్లోని చెరువులు అలుగు పోస్తున్నాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సింగరేణి మణుగూరు, కొత్తగూడెం, ఇల్లెందు ఏరియాల పరిధిలోని ఓసీల్లోకి వరద చేరింది. దీంతో వేలాది టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది.
ప్రాజెక్ట్లకు జలకళ..
వరుసగా కురుస్తున్న వర్షాలకు పాల్వంచ పరిధిలోని కిన్నెరసాని ప్రాజెక్ట్లోకి గురువారం భారీగా వరద నీరు చేరింది. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 407 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 400 అడుగులకు చేరుకున్నది. చర్ల మండల పరిధిలోని తాలిపేరు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరడంతో ప్రాజెక్ట్ అధికారులు 24 గేట్లు ఎత్తి 1,02,399 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. పాలేరు, వైరా రిజర్వాయర్లు, లంకపల్లి, బేతుపల్లి చెరువులు జలకళను సంతరించుకున్నాయి.
జోరుగా వ్యవసాయ పనులు..
మూడు రోజుల నుంచి కురుస్తున్న వానలు పంటలకు ఊపిరి పోశాయి. ఇప్పటికే ఉభయ జిల్లాల్లో వరి నాట్లు జోరందుకున్నాయి. మొలక దశలో ఉన్న పత్తికి వర్షం ప్రాణం పోసింది. అలాగే ఆరుతడి పంటలైన కంది, పెసర పంటలు చేవ పొందాయి. మరికొన్ని రోజుల్లో సాగర్ కాలువ పరీవాహక ప్రాంతంలోనూ నాట్లు ప్రారంభం కానున్నాయి.