భద్రాచలం, మార్చి 12: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో ఆదివారం సందర్భంగా అంతరాలయంలోని మూలవరులకు అభిషేకం నిర్వహించారు. అనంతరం 108 స్వర్ణ పుష్పాలతో స్వామివారికి అర్చన జరిపారు. ఈ పూజల్లో పాల్గొన్న భక్తులు పరవశం చెందారు. తెల్లవారుజామున ఆలయ తలుపులు తెరిచి అర్చకులు స్వామివారికి సుప్రభాత సేవ, ఆరాధన, ఆరగింపు, సేవాకాలం, నిత్య బలిహరణం, నిత్య హోమాలు, నిత్య పూజలు జరిపారు.
అనంతరం స్వామివారి ఉత్సవమూర్తులను బేడా మండపానికి తీసుకొని వచ్చి సంప్రదాయబద్ధంగా నిత్య కల్యాణం నిర్వహించారు. కల్యాణంలో పాల్గొన్న భక్తులకు స్వామివారి ప్రసాదాలను, శేష వస్ర్తాలను అందజేశారు.