భద్రాచలం, జనవరి 8 : భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవాలయంలో విశ్వరూప సేవను సోమవారం నేత్రపర్వంగా నిర్వహించారు. ఆలయంలోని సర్వ దేవతలను ఒకే వేదికపైకి వేంచేపు చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఓ వైపు ధూప, దీపాలు, మరో వైపు ఆస్థాన హరిదాసులు ఆలపిస్తున్న కీర్తనలతో ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. వైకుంఠ ఏకాదశి(ముక్కోటి ఏకాదశి) తర్వాత వచ్చే బహుళ ద్వాదశి రోజున ఉత్సవమూర్తులందరినీ ఒకే వేదికపై వేంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ విశేష సేవ ఒక్క భద్రాచలం రామాలయంలోనే చేపడతారు. అద్భుతమైన ఈ సేవను తిలకిస్తే సమస్త దేవతల దర్శనం లభించినట్లే.
ఆలయ ప్రాంగణంలో ఉన్న 108 దేవతామూర్తులను(ఆళ్వార్లతో సహా) ఒకే వేదికపై ఆశీనులను చేసి ప్రత్యేక అలంకరణలు చేయడంతో అల వైకుంఠం.. ఇల వైకుంఠంగా మారిపోయింది. గరుడ వాహనంపై శ్రీరామచంద్రమూర్తిని వేంచేపు చేసి చుట్టూ ఉత్సవమూర్తులను వేంచేపు చేసి ఆరాధనలు చేసి వివిధ రకాల కూరగాయలతో తయారు చేసిన కదంబం అనే ప్రసాదాన్ని నివేదించారు. అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులకు కదంబ ప్రసాదాన్ని పంపిణీ చేశారు. కార్యక్రమంలో దేవస్థానం ఈవో ఎల్.రమాదేవి, ఆస్థాన స్థానాచార్యులు కేఈ స్థలశాయి, ఏఈవోలు భవానీ రామకృష్ణ, ఆలయ ప్రధానార్చకులు పొడిచేటి సీతారామానుజాచార్యులు, అమరవాది విజయరాఘవన్, ఉప ప్రధాన, ముఖ్య అర్చకులు, పరిచారకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.