కూసుమంచి, డిసెంబర్ 29 : ‘ప్రజాపాలన’ దరఖాస్తుల ద్వారానే ఆరు గ్యారెంటీలు చేరవవుతాయని ప్రజాపాలన ఉమ్మడి జిల్లా నోడల్ ఆఫీసర్ రఘునందన్రావు అన్నారు. ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్తో కలిసి గైగొళ్లపల్లిలో శుక్రవారం నిర్వహించిన గ్రామసభలో ఆయన మాట్లాడారు. సత్వరం ఆరు గ్యారెంటీలను అమలు చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తున్నదన్నారు. వచ్చే నెల 6 లోపు ఒక కుటుంబం నుంచి ఒక దరఖాస్తును పంచాయతీ కార్యదర్శికి ఇస్తే చాలన్నారు. ఆధార్, రేషన్ కార్డు జత చేస్తే సరిపోతుందన్నారు. ఆదాయం, కుల ధ్రువీకరణ పత్రాలు అవసరం లేదన్నారు. ప్రజాపాలన లక్ష్యం నెరవేరాలంటే అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని, ప్రజల నుంచి ప్రతి దరఖాస్తును తీసుకుని రశీదు ఇవ్వాలని కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశించారు. ఒక కుటుంబానికి ఒక దరఖాస్తు సరిపోతుందన్నారు. అధికారులు ఆరు రోజుల పాటు దరఖాస్తులను స్వీకరిస్తారన్నారు. ఒక్క దరఖాస్తుకు ఆరు పథకాలూ వర్తిస్తాయన్నారు. రేషన్కార్డు లేకపోయినా పథకాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ప్రతి గ్రామసభ వద్ద హెల్ప్డెస్క్లు అందుబాటులో ఉంటాయన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సత్యప్రసాద్, డీఆర్డీవో విద్యాచందన, పాలేరు నియోజకవర్గ ఆర్వో ఎం.రాజేశ్వరి, స్పెషల్ ఆఫీసర్ డీఎస్వో గంటా శ్రీలత, ఏసీపీ బస్వారెడ్డి, సర్పంచ్ ముల్కూరి శ్యాంసుందర్ రెడ్డి, ఎంపీఈవో రామచందర్రావు, ఇరిగేషన్ ఏఈ కోటేశ్వరరావు, ఏపీవో అప్పారావు, పంచాయతీ కార్యదర్శి మహమూదా పాల్గొన్నారు.
దరఖాస్తులు ఎలా నింపుతున్నారు..?
ప్రజలు దరఖాస్తులు ఎలా నింపుతున్నారు? సిబ్బంది వాటిని ఎలా స్వీకరిస్తున్నారు..? అనే అంశాలపై ప్రజాపాలన ఉమ్మడి జిల్లా నోడల్ఆఫీసర్ రఘునందన్రావు గైగొళ్లపల్లి గ్రామసభలో హెల్ప్డెస్క్ సిబ్బందిని ఆరా తీశారు. దరఖాస్తుదారులతో స్వయంగా మాట్లాడారు. ఎవరెవరు ఏయే గ్యారెంటీలకు దరఖాస్తు చేసుకున్నారో తెలుసుకున్నారు. డీఆర్డీవో విద్యాచందన, స్పెషల్ ఆఫీసర్ శ్రీలత, వ్యవసాయశాఖ అధికారి వాణితో పాటు ఇతర అధికారులకు సలహాలు సూచనలిచ్చారు. అధికారులు శుక్రవారం ఒక్కరోజే సుమారు 400 మంది నుంచి దరఖాస్తులు స్వీకరించామని నోడల్ ఆఫీసర్కు తెలిపారు.