మామిళ్లగూడెం, మార్చి 18 : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన చెక్పోస్టుల వద్ద అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. ఈ సందర్భంగా నగరంలోని కాల్వొడ్డు వద్ద ఏర్పాటు చేసిన ఎస్ఎస్టీ చెక్పోస్టును సోమవారం కలెక్టర్ తనిఖీ చేసి మాట్లాడారు. విస్తృత తనిఖీలు చేపట్టి నగదు, మద్యం రవాణాను నియంత్రించాలన్నారు. పోలీసు సిబ్బంది ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే పంపించాలన్నారు. ప్రతి చెక్పోస్టులో వీడియోగ్రఫీకి చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఖమ్మం అర్బన్ తహసీల్దార్ సీహెచ్.స్వామి, అధికారులు పాల్గొన్నారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అధికారులు కచ్చితంగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని అన్ని శాఖల కార్యాలయాలను సందర్శించిన ఆయన రాజకీయ నేతలు, పార్టీలకు సంబంధించి క్యాలెండర్లు, పోస్టర్లు, ఫొటోలను తొలగించారా.. లేదా.. అని పరిశీలించారు. అధికారులు, సిబ్బంది ఎన్నికల నిబంధనలను తప్పక పాటించాలన్నారు. కలెక్టర్ వెంట శిక్షణా సహాయ కలెక్టర్ యువరాజ్, ఇంచార్జ్ డీఆర్వో ఎం.రాజేశ్వరి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది ఉన్నారు.
ఫ్లయింగ్ స్కాడ్ బృందాల వాహనాలను కలెక్టర్ గౌతమ్ కలెక్టరేట్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.సత్యప్రసాద్, సీపీవో శ్రీనివాస్, ఖమ్మం ఎంవీఐ వెంకటరమణ, అదనపు పౌరసంబంధాల అధికారి వి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.