సత్తుపల్లి, సెప్టెంబర్ 20 : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడబిడ్డలకు ప్రతి ఏడాది మాదిరిగానే సర్కార్ కానుక అందించనున్నది. అన్నిమతాలను సమానంగా గౌరవిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ‘బతుకమ్మ’ చీరెలను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. సిరిసిల్ల, పోచంపల్లి ప్రాంతాల్లో నేత కార్మికులు 10 రంగులు… 195 డిజైన్లలో ఎంతో నైపుణ్యంతో తయారుచేసిన చీరెలను అందించనున్నది. ఖమ్మం జిల్లాలో మొత్తం 4.27 లక్షల చీరెలు మహిళలకు పంపిణీ చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే జిల్లాకు 2.49 లక్షల చీరెలు రాగా… 1.78 లక్షలు రావాల్సి ఉంది. సద్దుల బతుకమ్మ వేడుకల కోసం సర్కార్ సారె అందించేలా కార్యాచరణ రూపొందిం చారు. ఎప్పటిలాగానే 18 ఏళ్లు నిండిన యువతులు, మహిళలకు వీటిని పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రతి ఏటా బతుకమ్మ పండుగను పురస్కరించుకుని ఆడబిడ్డలకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందిస్తోంది. ప్రజల సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ బతుకమ్మ చీరెలను పంపిణీ చేస్తున్నది.రాష్ట్రంలో అతిపెద్ద పండుగగా ఆడబిడ్డలు నిర్వహించే బతుకమ్మ పర్వదినాన ప్రతి మహిళ మోములో చిరునవ్వులు వెల్లివిరిసేలా సారెను సిద్ధం చేస్తున్నది. పది రంగులు, 195 డిజైన్లతో ఎంతో నాణ్యతతో నేతన్నలు తయారుచేసిన చీరెలను ఈనెలాఖరు నాటికి జిల్లావ్యాప్తంగా పంపిణీ చేసేలా సర్కారు ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వం నుంచి వచ్చిన చీరెలను వివిధ మండలాలకు కేటాయిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 4.27 లక్షల మంది మహిళలకు ఈ చీరెలు పంపిణీ చేసేందుకు కార్యాచరణ రూపొందించారు. తెలంగాణలో దసరా పండుగకు ప్రత్యేక స్థానం ఉంది. దీనికి ముందు నిర్వహించే సద్దుల బతుకమ్మ పండుగ అంటే మహిళలకు ఎంతో ప్రత్యేకం. ఊరు..వాడా, పల్లె..పట్నం తేడాలేకుండా మహిళలు, యువతులు ఉత్సాహంగా బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటారు. ప్రభుత్వం ఏటా బతుకమ్మ పండుగను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు అందించే బతుకమ్మ చీరెల్లో ఇప్పటికే కొన్ని జిల్లాలకు చీరెలు చేరగా గోదాముల్లో భద్రపరిచారు.
ఈసారి పట్టుచీరెల రూపంలో…
బతుకమ్మ చీరెల నాణ్యత, పంపిణీపై సర్కారు మహిళల నుంచి అధికారుల వరకు అభిప్రాయాలు సేకరించింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి మరింత ఆకర్షణీయంగా రంగురంగుల డిజైన్లతో చీరెలు తయారు చేయించింది. ఎలాంటి లోపాలు లేకుండా మరింత మన్నికతో కూడిన చీరెలను తయారు చేయించారు. వీటి ప్యాకింగ్ను కూడా సుందరంగా రూపొందించారు. ఇప్పటికే జిల్లాకు చేరిన బతుకమ్మ చీరెలను వివిధ మండలాలకు పంపుతున్నారు. రావాల్సిన చీరెలను మండలాలకు సరఫరా చేసేందుకు అధికారులు స్థలాలను సిద్ధం చేస్తున్నారు. బతుకమ్మ చీరెల నిల్వ ప్రదేశాల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. మండల కార్యాలయాల నుంచి ఆయా గ్రామాలకు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
జిల్లాకు 4.27 లక్షల బతుకమ్మ చీరెలు
రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది కూడా చీరెలు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకున్నది. సిరిసిల్ల నుంచి వచ్చిన చీరెలను ఇప్పటికే పలు మండలాలకు తరలించాం. మిగిలిన మండలాలకు వారంరోజుల్లో చీరెలు సరఫరా చేస్తాం. ప్రభుత్వ ఆదేశాలు రాగానే గ్రామాల వారీగా బతుకమ్మ చీరెల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నాం. రెవెన్యూ, డీఆర్డీవో, సివిల్సైప్లె అధికారుల సమన్వయంతో గ్రామాల్లో రేషన్డీలర్ల ద్వారా చీరెల పంపిణీ చేపడుతాం. అర్హులైన ప్రతి మహిళకు బతుకమ్మ కానుకగా చీరెలను అందిస్తాం.
– విద్యాచందన, డీఆర్డీవో, ఖమ్మం