భద్రాచలం, జూన్ 6 : పెండింగ్లో ఉన్న ఐదు నెలల వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏరియా ఆస్పత్రి ఎదుట సీఐటీయూ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో గురువారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కె.బ్రహ్మచారి మాట్లాడుతూ ఏరియా ఆస్పత్రికి కొత్త కాంట్రాక్టర్ వచ్చినప్పటి నుంచి కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఐదు నెలలుగా వేతనాలు లేకుండా ఎలా పని చేస్తారని ప్రశ్నించారు. వేతనాల కోసం ఫిబ్రవరి నెలలో ధర్నా చేయగా.. ఆస్పత్రి సూపరింటెండెంట్ రామకృష్ణ ద్వారా జీతాలు ఇప్పిస్తానని ఐటీడీఏ పీవో హామీ ఇచ్చినా అది అమలుకు నోచుకోలేదన్నారు. వెంటనే వేతనాలు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా.. ఆస్పత్రి సూపరింటెండెంట్ ఆదేశాల మేరకు ఆర్ఎంవో రాజశేఖర్రెడ్డితో చర్చలు జరిపారు. ఈ నెల 9న ఐదు నెలల జీతాలపై అధికారులతో మాట్లాడి కార్మికుల ఖాతాల్లో జమ చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. 9న వేతనాలు తమ ఖాతాల్లో పడకపోతే 10వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరిస్తూ నోటీసును ఆస్పత్రి సూపరింటెండెంట్కు అందజేశారు.