కొత్తగూడెం : అధికారుల తీరుపై జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో స్థాయీసంఘాల సమావేశంలో ఆయన మాట్లాడారు. వివిధ కార్పొరేషన్ల ద్వారా లబ్దిదారులకు ఇచ్చే రుణాలు వారికి సక్రమంగా అందాలని లేక పోతే చర్యలు తప్పవని అన్నారు. అక్రమ మార్గంలో నడుస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయని అలా ఎందుకు జరుగుతుందని అధికారులను ఆయన హెచ్చరించారు.
ప్రభుత్వ పథకాలు ప్రజలకు సక్రమంగా చేరుతున్నాయా..? గ్రామ స్థాయిలో అధికారులు పర్యవేక్షణ ఎంత వరకు ఉంది అని సమావేశాలు పెడుతున్నాం, నివేదికలు చదివి వినిపిస్తే సరిపోదు అని జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య అధికారుల తీరుపై మండిపడ్డారు. ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంటే మీరు నిర్లక్ష్యంగా పనిచేయడం సరికాదన్నారు.
ప్రతీ శాఖ నుంచి జిల్లా అధికారి సమావేశానికి రానప్పుడు జవాబు దారి ఎవరు ఉంటారని అన్నారు. ప్రజాప్రతినిధులు ప్రజల సమస్యలు అధికారుల దృష్టికి తీసుకు వెళదామని వస్తే సమాధానం చెప్పే అధికారి సమావేశానికి రాకపోవడం బాధాకరమని ఆయన అన్నారు.గిరివికాస్ పథకం ద్వారా వచ్చిన నిధులను వెంటనే ఖర్చు చేసే విధంగా పనులు పూర్తి చేయాలన్నారు. పనిచేయగలిగే ప్రతీ ఒక్కరికీ ఉపాధి జాబ్కార్డు ఇవ్వాలని ఆయన కోరారు.