రామవరం, ఆగస్టు 04 : తెలంగాణ రాష్ట్ర మైనార్టీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణానికి చెందిన మహమ్మద్ యాకూబ్ పాషా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్స్ వద్ద గల అబుల్ కలాం ఆజాద్ ఓరియంటల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ నందు జరిగిన కార్యక్రమంలో యాకూబ్ పాషా ఎన్నికను రాష్ట్ర అధ్యక్షుడు ఎంఏ.ఫారూఖ్ ఏకగ్రీవంగా ఆమోదించారు. గత కొన్నేళ్లుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మైనారిటీల సంక్షేమం కోసం నిరంతర శ్రమిస్తూ, విద్యార్థులకు అండదండగా ఉంటూ, మైనారిటీ సంక్షేమానికి పాటుపడుతున్నందున వీరి సేవలను గుర్తించి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగిందని ఎంఏ ఫారూఖ్ తెలిపారు.
ఈ సందర్భంగా యాకూబ్ పాషా మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న మైనారిటీల సమస్యలపై ప్రభుత్వం ద్వారా పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం మైనారిటీ సంఘాలు, రాష్ట్ర మైనారిటీ ఉద్యోగ సంఘం టీఎస్ మేసా ఎండీ.యాకూబ్ పాషాను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ నాయకులు ఖాజా మొయినుద్దీన్, నఫీస్ అహ్మద్, మాజిద్ పాల్గొన్నారు.