రుద్రంపూర్, సెప్టెంబర్ 12 : సింగరేణి కొత్తగూడెం ఏరియాలో 2026–27 వార్షిక సంవత్సరానికి సంబంధించిన వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ (డబ్ల్యూపీఎస్ అండ్ జీఏ) క్రీడలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. రుద్రంపూర్లోని ప్రొఫెసర్ జయశంకర్ క్రీడా మైదానంలో కబడ్డీ, బాల్ బ్యాడ్మింటన్ పోటీలను సత్తుపల్లి ఏరియా జనరల్ మేనేజర్ ఎస్. వెంకటాచారి, కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ సీహెచ్.వెంకటరమణ సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్లు మాట్లాడుతూ క్రీడలు ఉద్యోగుల్లో మానసిక ఉల్లాసాన్ని, శారీరక దారుఢ్యాన్ని పెంపొందించడంతోపాటు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని అన్నారు. క్రీడల్లో పాల్గొనడం వల్ల ప్రతి విషయంలోనూ సానుకూల ఆలోచనా విధానం పెరుగుతుందని, ఇది వ్యక్తిగత జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు.
గెలుపు, ఓటములతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తితో పోటీల్లో పాల్గొనాలని సూచించారు. క్రీడల్లో పాల్గొనే సమయంలో ఎటువంటి ప్రమాదాలు, గాయాలు తగలకుండా జాగ్రత్తలు పాటించాలని కోరారు. సానుకూల దృక్పథంతో క్రీడల్లో పాల్గొని ప్రతిభను చాటాలని, రీజినల్, కంపెనీ స్థాయి, కోల్ ఇండియా స్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొని కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాలకు కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని క్రీడాకారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఏరియా ఎస్ఓ టు జీఎం ఎం. గోవిందరావు, యూనియన్ ప్రతినిధులు, వివిధ క్రీడల కెప్టెన్లు, క్రీడాకారులు, ఇతర సభ్యులు పాల్గొన్నారు.

కొత్తగూడెం ఏరియాలో డబ్ల్యూపీఎస్ అండ్ జీఏ వార్షిక క్రీడలు ప్రారంభం