కొత్తగూడెం : దివ్యాంగులు వైకల్యాని అధిగమించి ముందుకు సాగుతుండటం ఎంతో అభినందనీయమని జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ అన్నారు. శుక్రవారం కొత్తగూడెం క్లబ్లో మహిళా శిశు, వయో వృద్దుల సంక్షేమ శాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని దివ్యాంగులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో దివ్యాంగులు కార్యాలయానికి వస్తే ఇబ్బంది పడకుండా సులభంగా ఉండేందుకు ర్యాంపులతో పాటు ప్రత్యేకంగా మరుగుదొడ్లు నిర్మాణం చేపట్టి దివ్యాంగులకు అందుబాటులోకి తేవాలని కమిషనర్లను ఆదేశించారు.
అవకాశాలను కల్పించాల్సిన బాధ్యత ప్రతీ అధికారిపై ఉందని, ప్రభుత్వం తరపు నుంచి దివ్యాంగుల సంక్షేమానికి జిల్లాలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో అమలు చేస్తున్నామని, ఇవి కాకుండానే ఇంకా వారికి చేయాల్సింది చాలా ఉందని, తప్పకుండా చేస్తామన్నారు. దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. దివ్యాంగులకు అవకాశాలు కల్పించడంలో జిల్లా ముందంజలో ఉంటుందని, దివ్యాంగుల నేస్తేంగా మన జిల్లాను తీర్చిదిద్దుతామని ఆయన చెప్పారు.
దివ్యాంగులు దేనిలో కూడా తక్కువ కాదని, అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ నిరూపిస్తున్నారని, ప్రపంచ స్థాయిలో నిర్వహించిన పారా ఒలంపిక్ క్రీడల్లో పాల్గొని మన దేశానికి బంగారు పతకాలు తీసుకొచ్చి దేశ కీర్తిని ప్రపంచం నలుమూలలు చాటి చెప్పారని, దివ్యాంగుల అభివృద్ధిక అవకాశాలు చేయూతను కల్పించేందుకు అన్నిశాఖల అధికారులను సమన్వయం చేస్తామని, దివ్యాంగులపై సానుభూతి కన్నా సహకారం అందించడం చాలా ముఖ్యమని, వారికి అన్ని విధాలా అండగా నిలవాల్సిన అవసరం ఉందని చెప్పారు.
జిల్లా కేంద్రంలో దివ్యాంగులు కమ్యూనిటీ హాల్ కావాలని అడుగుతున్నారని, ప్రత్యేక కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని, వారి హక్కులు కాపాడుకోవడానికి, చర్చా వేదికలు నిర్వహణకు కమ్యూనిటీహాల్ నిర్మించాలని అడిగారని, తక్షణమే స్థల సేకరణ చేయాల్సిందిగా తహసీల్దార్కు ఆదేశాలు జారీ చేసి దివ్యాంగులకు కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. దివ్యాంగులకు కేటాయించిన రిజర్వేషన్ ప్రకారం అన్ని శాఖల్లో ఉద్యోగ ఖాళీలు భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని, వైకల్యం అనేది మనిషికి మాత్రమేనని, మనస్సుకు కాదని, అవకాశాలు కల్పిస్తే వారు ఎందులో తక్కువ కాదని నిరూపిస్తున్నారని అన్నారు.
ఉపాధిహామీ పథకంలో ఎక్కువ పనిదినాలు కల్పించిన 22 మంది కార్యదర్శులకు ఏపీవోలు, ఈసీలు, టీఏలకు ప్రశంసా పత్రాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో డీడబ్ల్యూవో వరలక్ష్మీ, డీఆర్డీవో మధుసూధన్రాజు, డీఈవో సోమశేఖరశర్మ, మున్సిపల్ కమిషనర్ సంపత్కుమార్, జిల్లా దివ్యాంగ సంక్షేమసంఘం అధ్యక్షుడు గుండపనేని సతీష్లు పాల్గొన్నారు.