– బత్తుల వెంకటేశ్వర్లు
బూర్గంపహాడ్, జూన్ 27 : వీబీ జీ రామ్ జీ స్కీమ్కు వ్యతిరేకంగా ఉపాధి హామీ కార్మికులు జూలై 1న తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం పిలుపు మేరకు పంచాయతీ కార్యాలయాల వద్ద నిరసన తెలపాలని ఆ సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. శనివారం సారపాకలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామీణ పేదలకు కనీసం జీవన భద్రత లేకుండా చేస్తున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వం 125 రోజుల పని పెంచుతున్నామని గొప్పగా ప్రచారం చేస్తున్నా ఉపాధి కార్మికులకు ఆ మేరకు పనులు కల్పించడంలేదన్నారు. కేంద్రం కార్మికుల హక్కులను కాలరాస్తుందని మండిపడ్డారు.
ప్రస్తుతం తీసుకువచ్చే వీబీ జీ రామ్ జీ స్కీంతో ఉపాధి కార్మికులకు నష్టం కలుగుతుందని, మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంగా ఉంచాలని డిమాండ్ చేశారు. ప్రతి పంచాయతీ కార్యాలయం వద్ద జూలై 1న ఉపాధి కార్మికులు తమ నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీఐటీయూ ఐటీసీ బీపీఎల్ జనరల్ సెక్రటరీ ఎస్ కె.పాషా, రైతు సంఘం మండల కార్యదర్శి కందుకూరి నాగేశ్వరరావు, సీఐటీయూ నాయకులు బత్తుల గోపాలరావు, మర్రి వెంకటరెడ్డి పాల్గొన్నారు.