బూర్గంపహాడ్, జూన్ 01 : తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వీఓఏలు వంటావార్పు చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. నిరవధిక సమ్మెలో భాగంగా సోమవారం వారి శిబిరంలోనే వంటావార్పు కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ ఐకెపి వీఓఏల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) సెర్ప్ ఆద్వర్యంలో రాష్ట్రవ్యాప్త నిరవధిక సమ్మెలో భాగంగా వీఓఏల న్యాయమైన కోరికలు తీర్చాలని బూర్గంపహాడ్ ఎంపీడీఓ కార్యాలయం ముందు వీఓఏలు చేస్తున్న నిరవధిక సమ్మె 15వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా వీఓఏలు మాట్లాడుతూ.. గాలి దుమారాలతో కూడిన వర్షాలు లెక్క చేయక, మే నెల వడగాల్పుల తీవ్రతకు తట్టుకోలేక కొంతమంది వీఓఏలు అనేక ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ప్రభుత్వం తమ డిమాండ్లను ఒప్పుకునే వరకు సమ్మెను కొనసాగిస్తామని తెలిపారు.
కష్టానికి తగ్గ ఫలితం లేదని, వీఓఏలకు రూ.26,000 వేల గౌరవ వేతనం, పీఆర్సీ అమలు చేయాలని, వీఓఏలను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలని, ప్రమాద బీమా రూ.20 లక్షలు చెల్లించాలని, ఆరోగ్య బీమా రూ.10 లక్షలు కల్పించాలని, అర్హులైన వీఓఏలకు సిసిలుగా ప్రమోషన్ కల్పించాలన్నారు. వీఓఏలకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ట్యాబ్లు ఇచ్చి నెట్ సౌకర్యం కల్పించాలని, ఆన్లైన్ రిపోర్ట్ లు చేయమని, గ్రేడింగ్ పద్ధతిని రద్దు చేయాలని, వీఓఏ జీతాలు వీఓఏల అకౌంట్లోనే వేయాలని, అభయ హస్తం డబ్బులు పొదుపు సంఘాలకు ఇవ్వాలని, అర్హులైన వీఓఏలను సీసీలుగా ప్రమోషన్ ఇవ్వాలని, జీఓ నంబర్ 58ని సవరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వీఓఏల మండల అధ్యక్షురాలు నిర్మల, కోశాధికారి సావిత్రి, పద్మ, శ్రీ లక్ష్మీ, సుబ్బమ్మ, లలిత, గౌతమి, రాంచందర్, మండలంలోని 62 మంది వీఓఏలు పాల్గొన్నారు.