రుద్రంపూర్, మార్చి 18 : మానవతా విలువలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచేలా కొత్తగూడెం కార్పొరేషన్ 14వ వార్డులోని మోడ్రన్ ఇఖ్రా పాఠశాలలో ఉగాది, రంజాన్ పండుగలను ముందస్తుగా ఘనంగా నిర్వహించారు. కుల మతాలకు అతీతంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి ఆనందోత్సాహాలతో వేడుకలను జరుపుకున్నారు. షడ్రుచుల జీవన ప్రయాణంలో కొత్త ఆశయాలతో నూతన సంవత్సరమైన పరాభవ నామ ఉగాదికి స్వాగతం పలుకుతూ.. ప్రేమ, కరుణ, శాంతి, సహనం, దాతృత్వం, క్రమశిక్షణ, సమానత్వం, సోదరభావం వంటి గొప్ప విలువలకు ప్రతీకగా నిలిచే రంజాన్ పండుగ సందేశాలను ఈ సందర్భంగా పంచుకున్నారు. రంజాన్ సందర్భంగా అందరికీ “ఈద్ ముభారక్” శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం పర్వీన్ సుల్తానా మాట్లాడుతూ.. భిన్న కులాలు, విభిన్న మతాలు, సంస్కృతుల సమ్మేళనం భారతదేశం. ప్రతి పండుగ మనందరినీ ఒకే తాటిపైకి తీసుకు వస్తుంది. ఒకరి పండుగలను మరొకరు గౌరవించుకుంటూ కలిసి మెలిసి జీవించడం మన సంస్కృతి అని అన్నారు. కరస్పాండెంట్ అబ్దుల్ బాసిత్ మాట్లాడుతూ.. పాఠశాల అనేది కేవలం విద్య నేర్పే స్థలం మాత్రమే కాదు, మానవతా విలువలను పెంపొందించే దేవాలయం. చిన్నప్పటి నుంచే పిల్లలకు పరస్పర గౌరవం, సహనం, ఐక్యత వంటి విలువలను నేర్పించాలన్నారు. రాబోయే ఉగాది సంవత్సరంలో అందరూ సుఖ సంతోషాలతో, ప్రేమానురాగాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శిరీషా, నుసరత్, లక్ష్మీ ప్రసన్న, విజయలక్ష్మీ, సల్మా, జేఫీషా, సరస్వతి, సల్మా జబీన్, నాజియా పాల్గొన్నారు.

‘ఇతర పండుగలను గౌరవించడం మన సంస్కృతిని గౌరవించినట్లే’