రుద్రంపూర్, మే 18 : వేసవి ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న వేళ కార్పొరేషన్ పరిధిలోని రామవరం మాతా శిశు ఆరోగ్య కేంద్రం ఆవరణలోనాటిన హరితహారం మొక్కలు నీటి కోసం ఎదురుచూస్తున్నాయి. ఒకప్పుడు పచ్చదనంతో కళకళలాడిన ఈ చెట్లు ప్రస్తుతం నీటి కొరతతో మాడిపోతూ కనిపిస్తున్నాయి. ఆరోగ్య కేంద్రం ప్రధాన ద్వారం ముందు గతంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా పలు నీడనిచ్చే చెట్లను నాటి మాత శిశు సంబంధించిన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కాగా వాటి సంరక్షణ నిర్లక్ష్యానికి గురై చెట్లు ఎండిపోతున్న పరిస్థితి నెలకొంది. పక్కనే బోర్ సౌకర్యం ఉన్నప్పటికీ చెట్లకు క్రమం తప్పకుండా నీరు అందకపోవడం విచారకరం అంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి క్రమం తప్పకుండా నీరందిస్తూ పచ్చదనం పెంపునకు దోహదం చేయలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.