దమ్మపేట :వరికి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని అశ్వారావుపేట వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు అఫ్జల్ బేగం రైతులకు సూచించారు. మల్లారం రైతు వేదికలో మంగళవారం ముష్టిబండ రైతులతో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. వరికి ప్రత్యామ్నాయంగా అపరాలు, వేరుశనగ, పామాయిల్ వంటి నూనె గింజల పంటలను సాగు చేయాలన్నారు. దీనిపై స్పందించిన రైతులు పామాయిల్ సాగు చేయడానికి మొక్కలకు ఇప్పటికే దరఖాస్తులు చేసుకున్నామన్నారు.
మొక్కలు ఇప్పిస్తే వెంటనే పామాయిల్ సాగు ప్రారంభిస్తామన్నారు. సొసైటీ అధ్యక్షులు రావు జోగేశ్వరరావు మాట్లాడుతూ రైతులకు ఎరువులు సిద్దంగా ఉన్నాయన్నారు. అపరాల విత్తనాలు సైతం రైతులకు అందుబాటులో ఉంచుతామన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయాధికారి చంద్రశేఖర్ రెడ్డి, ఏఈఓ దీప్తి, ఉడతనేని మధు, మాధవరావు, బుచ్చిబాబులు పాల్గొన్నారు.