దమ్మపేట, జూలై 04 : దమ్మపేట మండలం గోపాలపురం గ్రామంలో విద్యుదాఘాతానికి గురై మూడు బర్రెలు మృతి చెందాయి. గతరాత్రి మండలంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో గోపాలపురం గ్రామంలోని ఒక పామాయిల్ తోటలో ఉన్న చెట్లు గాలివాన ధాటికి విరిగి పక్కనే ఉన్న విద్యుత్ తీగలపై పడ్డాయి. దీంతో విద్యుత్ వైర్లు తెగి నేలకొరిగాయి. ఈ విషయం తెలియని స్థానిక రైతు దండి జయమ్మ అనే మహిళ శనివారం ఉదయం తన బర్రెలను మేపడానికి ఆ పామాయిల్ తోట వైపు తోలుకెళ్లింది. తోటలో కిందపడి ఉన్న విద్యుత్ తీగలు తగలడంతో మేతమేస్తున్న బర్రెలు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాయి. పక్కనే ఉన్న జయమ్మ తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తమ జీవనాధారమైన మూడు బర్రెలు ఒకేసారి మృత్యువాత పడడంతో బాధితురాలు కన్నీరుమున్నీరుగా విలపించింది. దాదాపు రెండున్నర లక్షల రూపాయల మేర నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం స్పందించి తగిన నష్ట పరిహారం అందించి ఆదుకోవాలని బాధితురాలు, స్థానిక గ్రామస్తులు కోరుతున్నారు.