రుద్రంపూర్, సెప్టెంబర్ 07 : సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని రుద్రంపూర్ పంచాయతీ ప్రాథమిక పాఠశాలలో గుర్తుతెలియని వ్యక్తులు సుమారు 100 మీటర్ల సర్వీస్ కేబుల్ను కత్తిరించి తీసుకెళ్లారు. సోమవారం పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయులు చోరీని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాఠశాల ఆవరణలో రాత్రివేళ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని స్థానికులు, ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గంజాయి ప్యాకెట్లు కనిపించడం, మద్యం సేవిస్తున్నట్లు ఆరోపణలు ఉండటంతో పాటు చిన్నారులు వినియోగించే టాయిలెట్ తలుపులు సైతం చోరీకి గురైనట్లు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, పరిసర ప్రాంతాల్లో తరచూ దొంగతనాలు జరుగుతున్నా ఫిర్యాదులు స్వీకరించడం వరకే పరిమితమవుతున్నాయని బాధితులు ఆరోపిస్తున్నారు. నిందితులను గుర్తించి చర్యలు తీసుకోవడంలో జాప్యం జరుగుతోందని వాపోతున్నారు.
టూ టౌన్ పోలీస్స్టేషన్లో ఇన్స్పెక్టర్ స్థానం ఖాళీగా ఉండటంతో పర్యవేక్షణపై కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. రాత్రివేళ పెట్రోలింగ్ను పెంచడంతో పాటు పాఠశాల పరిసరాల్లో నిఘా ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఖాళీగా ఉన్న ఇన్స్పెక్టర్ పోస్టును వెంటనే భర్తీ చేసి శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దొంగతనం జరిగిన విషయాన్ని తెలుసుకున్న రుద్రంపూర్ సర్పంచ్ బానోత్ కేస్లీ, వార్డ్ మెంబర్ ఫయాజ్ పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయులతో మాట్లాడారు. పాఠశాలలో జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలను అడ్డుకునేందుకు సర్పంచ్ సహాయ సహకారాన్ని ఉపాధ్యాయులు వారి దృష్టికి తీసుకెళ్లారు.