– కొత్తగూడెం ఏరియా సివిల్ ఏజీఎం సీహెచ్ రామకృష్ణ
రుద్రంపూర్, ఆగస్టు 26 : “సింగరేణి నాకు జీవితాన్ని ఇచ్చింది. ఈ సంస్థ తల్లి లాంటిది. సింగరేణి తల్లి రుణాన్ని మనం ఎప్పటికీ తీర్చుకోలేం. సంస్థలో పని చేస్తున్న ప్రతి ఉద్యోగి, కాంట్రాక్ట్ కార్మికుడు అంకితభావంతో, క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలి. మనం చేసే పనికి సంస్థ అందించే వేతనానికి న్యాయం చేయాలి. మనమంతా కష్టపడి పనిచేస్తే సంస్థ అభివృద్ధి చెందుతుంది. సంస్థ బాగుంటే మనమూ బాగుంటాం” అని సింగరేణి కొత్తగూడెం ఏరియా సివిల్ ఏజీఎం సీహెచ్ రామకృష్ణ అన్నారు. ఈ నెలలో పదవీ విరమణ చేయనున్న సందర్భంగా బుధవారం రుద్రంపూర్ సీఈఆర్ క్లబ్లో ఏరియాలో పని చేస్తున్న సుమారు 400 మంది కాంట్రాక్ట్ కార్మికులతో రామకృష్ణ దంపతులు, భోజనాలు ఏర్పాటు చేసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ కార్మికులు రామకృష్ణను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “సింగరేణి సంస్థ మనకు కేవలం ఉద్యోగం మాత్రమే ఇవ్వలేదు. మన కుటుంబాలకు జీవనాధారాన్ని కల్పించింది. అందుకే సంస్థ పట్ల ప్రతి ఒక్కరికీ బాధ్యత, గౌరవం ఉండాలి. విధుల్లో క్రమశిక్షణ, అంకితభావం చాలా ముఖ్యం. మన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించినప్పుడే సంస్థ మరింత అభివృద్ధి చెందుతుంది” అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ సూపర్వైజర్లు గూడెల్లి యాకయ్య, సాదిక్, అనిల్, మహబూబ్ పాషా, అంజి, షకీల్, జయంత్, కృష్ణ, సంజయ్, మోతి, అరవింద్, మురళి, మద్దెల శ్రీనివాస్, వాల్వ్ ఆపరేటర్లు, పంప్ డ్రైవర్లు, సివిల్ విభాగం సిబ్బంది సుమంత్, షబ్బీర్, మల్లికార్జున్, శ్రీనివాస్ పాల్గొన్నారు.