– మంత్రి తుమ్మలను కోరిన మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు
దమ్మపేట, జూలై 09 : పెద్దవాగు ప్రాజెక్టుకు గండి పడడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆయకట్టు రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు తాటి వెంకటేశ్వర్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కోరారు. దమ్మపేట మండలం గండుగులపల్లి గ్రామంలోని తన నివాసంలో ఆయన మాట్లాడుతూ.. పెద్దవాగు ప్రాజెక్ట్ దెబ్బతినడంతో ఆయకట్టు రైతులు వరుసగా మూడు పంట సీజన్లుగా తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులతో తుమ్మల నాగేశ్వరరావు చర్చించి పెద్దవాగు ప్రాజెక్ట్ మరమ్మత్తు పనులను అత్యవసరంగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా పెద్దవాగు ప్రాజెక్ట్ ఆయకట్టు రైతులతో కలిసి త్వరలోనే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును కలిసి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, సాగునీటి ఇబ్బందులను నేరుగా వివరించనున్నట్లు తాటి వెంకటేశ్వర్లు తెలిపారు.