హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): స్కిల్ యూనివర్సిటీలో పాలిటెక్నిక్ కళాశాలలను విలీనం చేస్తే ఉన్నత చదువులు దూరమవుతాయి, ఉద్యోగాలూ దక్కవని పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. స్కిల్ యూనివర్సిటీలో పాలిటెక్నిక్ కాలేజీల విలీనానికి కాంగ్రెస్ ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇవ్వడాన్ని నిరసిస్తూ మూడో రోజైన మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు కొనసాగాయి. విద్యార్థులు, అధ్యాపకులు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలతో హోరెత్తించారు. సేల్ పాలిటెక్నిక్ అంటూ నినాదాలు మిన్నంటాయి. అధ్యాపకులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తంచేశారు. ఏబీవీపీ, ఏఐఎస్ఎఫ్, ఎస్ఫ్ఐ, ఏఐడీఎస్వో వంటి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసనలు చేపడుతున్నారు. ఎక్కడికక్కడ రాస్తారోకోలు, ధర్నాలు, మానవహారాలు నిర్వహించారు. కొత్తగూడెంలో జేఏసీ నేతలు సీపీఐఎల్పీ లీడర్ కూనంనేని సాంబశివరావును కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఎవరిని అడిగి పాలిటెక్నిక్ కాలేజీలను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేశారని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ఎవరినీ సంప్రదించకుండా విలీనం చేయడమేంటని నిలదీస్తున్నారు. పాలిటెక్నిక్ కళాశాలలను విలీనం చేస్తే డిప్లొమా విద్యార్థులకు ఉద్యోగాలే దక్కవని, సాంకేతిక విద్యామండలి స్వతంత్రత దెబ్బతింటుందని, డిప్లొమా కోర్సులను సర్కార్ నిర్వీర్యం చేస్తున్నదని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఈసెట్ ద్వారా ల్యాట్రల్ ఎంట్రీకి అవకాశమే ఉండదని, ఉన్నత చదువులు కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. తక్షణమే జీవో97 రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా సాంకేతిక విద్యామండలి స్వతంత్రత దెబ్బ తింటుందని, డిమాండ్ ఉన్న డిప్లొమా కోర్సులను సర్కారు ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేస్తున్నదని మండిపడ్డారు.
పాలిటెక్నిక్ కాలేజీల విలీనం ఇష్టం లేకపోతే తొలగిస్తామని మంత్రి వివేక్ వెంకటస్వామి హామీనిచ్చినట్టు పాలిటెక్నిక్ జేఏసీ నేతలు తెలిపారు. కొత్తగూడెం జిల్లా మణుగూరు ఐటీఐ కాలేజీలో మంత్రిని కలిసిన జేఏసీ నేతలు పాలిటెక్నిక్ కాలేజీల విలీనాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రస్తుత విధానంలోనే పాలిటెక్నిక్ కాలేజీలను కొనసాగించాలని కోరారు. కేంద్రం నిధులు వస్తాయనే పాలిటెక్నిక్ కాలేజీలను శక్తి పాలసీలోకి తీసుకొచ్చి స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేశామని, ఇష్టంలేకపోతే తొలగిస్తామని మంత్రి తమతో చెప్పారని జేఏసీ నేతలు తెలిపారు.