– బూర్గంపహాడ్లో రెసిడెన్షియల్, కస్తూర్భా పాఠశాలల ఆకస్మిక తనిఖీ
బూర్గంపహాడ్, మార్చి 10 : గురుకులాలతో పాటు ప్రభుత్వ పాఠశాల, వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని, వారి ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని కలెక్టర్ అంకిత్ అధికారులను హెచ్చరించారు. మంగళవారం బూర్గంపహాడ్ మండల కేంద్రమైన బూర్గంపహాడ్ తెలంగాణ రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాల, కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) పాఠశాలలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. తొలుత రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలలో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై ఆరాతీసి భోజన నాణ్యత, పాఠశాల నిర్వహణ, పరిశుభ్రతను పర్యవేక్షించారు. ఆరుబయట ఉన్న ఐస్క్రీమ్ డిస్క్ బండిని గమనించిన కలెక్టర్ అక్కడకు స్వయంగా వెళ్లి ఐస్క్రీమ్స్ గడువు తేదీలు, నాణ్యతను పరిశీలించారు. విద్యార్ధుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నాణ్యత లేని, గడువు తీరిన ఆహార పదార్ధాలు విక్రయించవద్దన్నారు. పాఠశాలలు, వసతిగృహాల్లోకి బయటి నుండి వచ్చే ఆహార పదార్ధాలు అనుమతించవద్దన్నారు.
అనంతరం కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేసి తరగతి గదులు, మరుగుదొడ్లు, వంటశాలలో ఆహార పదార్ధాలను క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యతతో ఉన్నాయో లేదో అడిగి తెలుసుకుని రుచి చూశారు. విద్యార్థులకు నిర్ణీత సమయంలో మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని, భోజన విషయంలో నిబంధనలు పాటించకపోతే శాఖాపరమైన చర్యలు ఉంటాయన్నారు. అనంతరం తరగతి గదిలో విద్యార్ధుల పఠనా సామర్ధ్యాన్ని పరిశీలించారు. విద్యార్థుల పఠనా సామర్ధ్యం మరింత పెంపొందించేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాలల పరిసరాలు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మరుగుదొడ్లు రోజుకు మూడుసార్లు శుభ్రం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సిబ్బందిని ఆదేశించారు. ఉదయం విద్యార్థులకు రాగిజావ, పల్లిపట్టు ఇవ్వాలని, పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక స్టడీ అవర్స్ నిర్వహించాలని, ఆ సమయంలో వారికి స్నాక్స్ అందించాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట ఎంపీడీఓ జమలారెడ్డి, తాసీల్దార్ కేఆర్కే ప్రసాద్, ఎంఈఓ యదుసింహరాజు, రెసిడెన్షియల్, కస్తూర్భా గాంధీ పాఠశాల, కళాశాలల నిర్వాహకులు, సిబ్బంది ఉన్నారు.