రామవరం, ఆగస్టు 20 : సింగరేణి సంస్థకు కొత్త బొగ్గు గనులు తీసుకురాకుండా గారడి మాటలతో కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా సింగరేణి వ్యాప్తంగా పోరాటాలు చేయనున్నట్లు మాజీ మంత్రి, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్ తెలిపారు. బుధవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో జరిగిన టీబీజీకేఎస్ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్త బొగ్గు గనుల సాధన కోసం, ఆదాయ పన్ను రద్దు కోసం ఢిల్లీలో ఆందోళన నిర్వహిస్తామని, కార్మిక సమస్యల పరిష్కారం కోసం సింగరేణి భవన్ ఎదుట నిరసన పోరాటాలకు సిద్ధం కావాలని కార్మికులకు పిలుపునిచ్చారు.
సంఘం అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సింగరేణి సంస్థ భవిష్యత్ కొత్త బొగ్గు గనులను సాధించడంతోనే ముడిపడి ఉన్నదని సమావేశం అభిప్రాయపడింది. ఎలాంటి టెండర్ ప్రక్రియ లేకుండా తెలంగాణలోని బొగ్గు గనులను సింగరేణి సంస్థకే కేటాయించాలని సమావేశం డిమాండ్ చేసింది. కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి నాలుగు ఉమ్మడి జిల్లాలలోని బొగ్గు బ్లాకులను సింగరేణికే కేటాయించి, కార్మికుల భవిష్యత్ను, తెలంగాణ ప్రజల ఉపాధి అవకాశాలను కాపాడాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త బొగ్గు గనులు సింగరేణి సంస్థకు కేటాయించే విధంగా చొరవ చూపాలని, ఎన్నికలలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని సమావేశం డిమాండ్ చేసింది.
ఇన్కమ్ ట్యాక్స్ ను బొగ్గు గని కార్మికులకు రద్దు చేయాలన్నారు. సింగరేణి సంస్థ 2024- 25 సంవత్సరంలో సాధించిన లాభాలను వెంటనే ప్రకటించాలని, అందులో నుండి 35 శాతం వాటాను కార్మికులకు చెల్లించాలన్నారు. 190/240 మాస్టర్లు పూర్తి చేసుకున్న బదిలీ వర్కర్లను వెంటనే పర్మినెంట్ చేయాలని, వివిధ డిజిగ్నేషన్లపై యాక్టింగ్ పనులు నిర్వహిస్తున్న కార్మికులకు ప్రమోషన్ ఇవ్వాలని సమావేశం డిమాండ్ చేసింది. ఎంతోకాలంగా పెండింగ్లో ఉన్న వివిధ డిజిగ్నేషన్ లలో ఖాళీలను పూరించాలన్నారు. రూ.40 వేల కోట్ల బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చెల్లించాలన్నారు. సింగరేణి సంస్థ పరిరక్షణకు సేవ్ సింగరేణి బచాలో కాంగ్రెస్కు హఠావో పేరిట సింగరేణి యాత్ర నిర్వహించాలని సమావేశం ఏకగ్రీవంగా నిర్ణయించింది.
ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకట రమణారెడ్డి, బాల్క సుమన్, పుట్ట మధుకర్, కోరుకంటి చందర్, హరిప్రియ నాయక్, చిన్నయ్య, దివాకర్ రావు, టీబీజీకేఎస్ రాష్ట్ర ముఖ్య ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ, కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రామమూర్తి, సీనియర్ ఉపాధ్యక్షుడు నూనె కొమురయ్య, ఉపాధ్యక్షులు బడికల సంపత్, మంగీలాల్తో పాటు 10 డివిజన్ల ఉపాధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గం కౌన్సిల్ సభ్యులు, కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ గడప రాజయ్య, వసికర్ల కిరణ్, మురళి, బోరింగ్ శంకర్, ఈశ్వర్, అశోక్, తిరుపతి పాల్గొన్నారు.
తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుడిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను టీబీజీకేఎస్ కేంద్ర జనరల్ కౌన్సిల్ సమావేశం ఏకగ్రీవంగా ఎన్నుకుంది. సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రామమూర్తి సంఘం గౌరవాధ్యక్షుడుగా కొప్పుల ఈశ్వర్ పేరును ప్రతిపాదించగా నూనె కొమురయ్య, కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, కాపు కృష్ణ బలపరిచారు.