రుద్రంపూర్, ఫిబ్రవరి 23 : పారిశుధ్య పనుల్లో అలసత్వం ప్రదర్శిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని కొత్తగూడెం ఏరియా సివిల్ ఈఈ సుమంత్ స్పష్టం చేశారు. సోమవారం ఏరియా పరిధిలోని ధన్బాద్ ప్రాంతంలో జరుగుతున్న సివిక్ పనులను సూపర్వైజర్ నిఖిల్ ఆధ్వర్యంలో ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పనుల తీరు, నిర్వహణ విధానం గురించి సంబంధిత సిబ్బందిని ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు. ముఖ్యంగా రోడ్లపై చెత్త పేరుకుపోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చెత్త కుండీలను నిర్ణీత వ్యవధిలో ఖాళీ చేయడంతో పాటు బ్లీచింగ్ పౌడర్ చల్లి శుభ్రతను కాపాడాలని సూచించారు. పారిశుధ్యం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని, విధుల్లో అలసత్వం వహించిన వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఈఈ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ సూపర్వైజర్ షకీల్ పాల్గొన్నారు.