చుంచుపల్లి, మే 23 : మద్యం సేవించి లారీలు నడుపుతూ పట్టుబడితే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ తెలిపారు. శుక్రవారం కొత్తగూడెం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 3 ఇంక్లైన్ లారీ యూనియన్ ఆఫీసులో లారీ డ్రైవర్లతో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలను నివారించడంలో భాగంగా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు లారీ డ్రైవర్లకు అవగాహన కల్పించారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రైవర్లు రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ బాధ్యతగా మెలగాలని సూచించారు. నిద్రలేమితో వాహనాలను నడిపితే ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందన్నారు. ఎప్పటికప్పుడు తమ వాహనాల ఇంజిన్లు, టైర్లు చెక్ చేసుకోవాలని తెలిపారు. సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయొద్దని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వన్టౌన్ ఇన్స్పెక్టర్ కరుణాకర్, టూ టౌన్ ఎస్ఐ కిశోర్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Chunchupalli : మద్యం సేవించి లారీలు నడుపుతూ పట్టుపడితే కఠిన చర్యలు : డీఎస్పీ రెహమాన్