భద్రాచలం, మార్చి 17: సకల గుణాధాముడు.. జగదభిరాముడి వసంతోత్సవం, డోలోత్సవానికి గురువారం భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో అంకురార్పణ జరిగింది. సాయంత్రం 4 గంటలకు అర్చకులు పవిత్ర గోదావరి నుంచి మేళతాళాల నడుమ తీర్థపు బిందె తీసుకువచ్చారు. స్వామివారికి ఆరాధన, దర్బార్ సేవ నిర్వహించారు. భగవత్ ప్రార్థన చేశారు. యాగశాలలో విశ్వక్సేన పూజ, రక్షాబంధనం, పుట్ట మన్నుతో పూజ, నవధాన్యాలతో అర్చన, అఖండ దీపారాధన, ద్వార తోరణ పూజ చేపట్టారు.
ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి సందర్భంగా శుక్రవారం ఆలయ ప్రాంగణంలో వసంతోత్సవం, డోలోత్సవాలు జరుగ నున్నాయి. ఆలయ అధికారులు అందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు పవిత్ర పుణ్య జలాలను గోటి తలంబ్రాలపై చల్లుతారు. రోలు, రోకలిలో లక్ష్మి, సరస్వతి అమ్మవార్లను ఆవాహన చేసి రోకలికి కంకణధారణ చేస్తారు. తొమ్మిది మంది ముత్తైదువలు పసుపు కొమ్ములు దంచుతారు. స్వామివారిపై బుక్కా, గులాల్, అత్తరు, పన్నీరు చల్లుతారు. పసుపు, కుంకుమతో పాటు ఇతర ద్రవ్యాలు కలిపి 1,108 మంది మహిళలు తలంబ్రాలను కలుపుతారు. దీంతో రామయ్య పెండ్లి పనులు మొదలైనట్లు లెక్క. అనంతరం అర్చకులు వసంతుడిని ఆవాహన చేసి తొమ్మిది పసుపు ముద్దలను సిద్ధం చేస్తారు. మంత్రాలను జపిస్తూ వసంతాన్ని ప్రోక్షిస్తారు. పసుపు ముద్దల్లో ఒక ముద్దను రామయ్య శిరస్సుపై, రెండోది అమ్మవారి మంగళసూత్రం వద్ద, మూడో ముద్దను లక్ష్మణస్వామిరి వక్షస్థలంపై ఉంచుతారు. అప్పటి నుంచి సీతారాములను పెండ్లికొడుకు, పెండ్లి కుమార్తెగా భావిస్తారు. అనంతరం వివిధ ప్రాంతాల నుంచి గోటి తలం బ్రాలు తెచ్చిన భక్తులు ఆలయ అధికారులకు అందజేస్తారు.
ఏప్రిల్ 2 నుంచి 16 వరకు భద్రాచలంలోని రామాలయ సన్నిధిలో వైభవోపేతంగా బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. 10న పట్టణంలోని మిథిలా స్టేడియంలో అంగరంగ వైభవంగా శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం, 11న పట్టాభిషేకం జరుగనున్నది. కరోనా కారణంగా రెండేండ్లుగా శ్రీరామనవమి, ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు ఆలయంలో ఆంతరంగికంగానే జరిగాయి. ప్రస్తుతం కరోనా ప్రభావం లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం బ్రహ్మోత్సవాలను వైభవోపేతంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈమేరకు దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధికారులకు ఆదేశాలిచ్చింది. రూ.1.10 కోట్ల తో బ్రహ్మోత్సవాలు, కల్యాణ మహోత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవస్థానం ఈవో బానోత్ శివాజీ తెలిపారు. ఉత్సవాలపై ఇప్పటికే భద్రాద్రి కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ జిల్లాస్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ నెల 19న మరోసారి స మీక్షించనున్నారు. 21న రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ జిల్లాఅధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.