బూర్గంపహాడ్, ఆగస్టు 21 : నిరుపేదల పక్షాన నిలబడి ఇళ్లు, ఇళ్ల స్థలాలు, పోడు భూముల కోసం భూ పోరాటాలు చేసిన సిద్ధి వెంకటేశ్వర్లు సేవలు మరువలేనివని సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యవర్గ సభ్యుడు మువ్వా వెంకటేశ్వరరావు(లడ్డా) అన్నారు. శుక్రవారం ఉమ్మడి రాష్ట్రంలో పార్టీ మాజీ సహాయ కార్యదర్శిగా పనిచే సిన సిద్ధి వెంకటేశ్వర్లు 4వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. మువ్వా వెంకటేశ్వర్లు కపర్తిభవన్లో సిద్ధి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మువ్వా మాట్లాడుతూ బూర్గంపహాడ్ నియోజకవర్గంగా ఉన్న సమయంలో సిద్ధి పాత్ర గొప్పదన్నారు. ఆయన మనమధ్య లేకపోయినా సిద్ధి చేసిన పోరాటాలు పేదప్రజల గుండెల్లో నిలిచిపోయాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమితి సభ్యులు పేరాల శ్రీనివాసరావు, ఎండీ సాజిద్, 7వ వార్డు సభ్యులు గూగల్ బీమానాయక్, జహీర్ పాల్గొన్నారు.