బూర్గంపహాడ్, ఏప్రిల్ 03 : బూర్గంపహాడ్ మండల పరిధిలోని పారిశ్రామికవాడ సారపాకలో వరుస చోరీలు చోటుచేసుకుంటున్నాయి. సారపాకలో ఐరన్షాపులో గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడటంతో రూ.30 వేలు నగదు చోరీకి గురైనట్లు బాధితుడు భూమా వెంకటచంద్రశేఖర్రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా మేడే కాలనీలోని ఓ ఇంటి తాళాన్ని దొంగలు పగులగొట్టి బీరువాలో ఉన్న సుమారు రూ.76 వేలు అపహరించినట్లు సమాచారం. అయితే ఆ ఇంటి యజమాని కేరళకు వెళ్లడంతో దొంగలు పథకం ప్రకారమే ఈ చోరీ చేశారని స్థానికులు చెబుతున్నారు.
విషయం తెలుసుకున్న పోలీసులు చోరీ జరిగిన ఇంటిని పరిశీలించి క్లూస్ టీమ్ ద్వారా వేలిముద్రలు సేకరించారు. అంతేకాకుండా సారపాకలో ఇటీవల నూతనంగా నిర్మించిన పబ్లిక్ టాయిలెట్లో కూడా దొంగలు ట్యాప్లు, వాష్ బేసిన్ ఎత్తుకెళ్లినట్లు స్థానికులు చెప్పారు. సారపాకలో వరుస దొంగతనాల నేపథ్యలో పోలీసులు నిఘా ఏర్పాటు చేసి చోరీలకు పాల్పడిన వారిని పట్టుకోవడంతో పాటు ఈ ప్రాంతంలో గస్తీని ముమ్మరం చేయాలని, రాత్రి సమయాల్లో పోలీస్ పెట్రోలింగ్ విస్తృతంగా చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.