చుంచుపల్లి, జూలై 14 : సుజాతనగర్ మండలం పాత, కొత్త అంజనాపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో తెలంగాణ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్, విద్యానగర్–కొత్తగూడెం ఆధ్వర్యంలో 50 మంది విద్యార్థులకు రూ.20 వేల విలువైన స్కూల్ బ్యాగులు, నోట్బుక్స్, పెన్నులు, పెన్సిల్స్ తదితర విద్యా సామగ్రిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి కీ.శే.పోక వెంకటేశ్వర్లు, వెంగమ్మ జ్ఞాపకార్థం వారి కుమారుడు పోక శ్రీనివాసరావు, కోడలు సృజన (అమెరికా) దంపతులు ఆర్థిక సహకారం అందించగా, అమర్ ఎంటర్ప్రైజెస్ ప్రతి విద్యార్థికి రెండు పెన్నులు ఉచితంగా అందించింది. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు కొల్లు నాగేశ్వరరావు విద్యార్థుల కోసం సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. సెక్రటరీ సురేష్ కుమార్ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో చదివి సమాజ సేవలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంఈఓ ఎల్. లీల, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సర్పంచ్లు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.