పెనుబల్లి, ఆగస్టు 25: పేదల ఇళ్ల వద్దకే పథకాలు చేర్చుతున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని, లబ్ధిదారుల వద్దకే ప్రభుత్వ ఫలాలు వెళ్తుండడంతో వారు సైతం మిక్కిలి సంతోషం వ్యక్తం చేస్తున్నారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యుత్తమ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ మానవతా స్ఫూర్తిని చాటుతున్నాయని గుర్తుచేశారు. మండలంలోని రామచంద్రాపురం, భవన్నపాలెం, పార్థసారథిపురం, లింగగూడెం, ఎడ్ల బంజరు, గౌరారం, పెనుబల్లి గ్రామాల్లో గురువారం ఆయన విస్తృతంగా పర్యటించారు. ఆయా గ్రామాల్లోని లబ్ధిదారులకు నూతన ఆసరా పింఛన్ మంజూరు కార్డులు, సీఎంఆర్ఎఫ్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా గతంలో ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి కేసీఆర్ 57 ఏళ్లు నిండిన వారందరికీ నూతన పింఛన్లు మంజూరు చేశారని అన్నారు. గతంలో సత్తుపల్లి నియోజకవర్గంలో 29 వేల మందికి ఆసరా పింఛన్లు వచ్చేవని, ఇప్పుడు నూతనంగా మరో 11 వేల మందికి మంజూరు చేశారని, దీంతో మొత్తం 40 వేల మందికి పింఛన్లు అందుతున్నాయని వివరించారు. పెనుబల్లి మండలంలో 1,850 మందికి పింఛన్లు మంజూరయ్యాయన్నారు. ఇంకా లబ్ధిదారులు మిగిలి ఉంటే వారు కూడా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనంతరం ఆయా గ్రామాల్లోని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సీఎంఆర్ఎఫ్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. వీటితోపాటు ప్రతి ఆడబిడ్డకూ చీరసారెను అందజేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, టీఆర్ఎస్ నేతలు లక్కినేని అలేఖ్య, చెక్కిలాల లక్ష్మణ్రావు, మహాలక్ష్మీ, రమాదేవి, కనగాల వెంకటరావు, పసుమర్తి వెంకటేశ్వరరావు, చింతనిప్పు సత్యనారాయణ, లక్కినేని వినీల్, రామారావు, నీలాద్రిబాబు, కరీముల్లా, అజిత్ పాల్గొన్నారు.
కేసీఆర్ జోలికొస్తే సహించేది లేదు..
మత విద్వేషాల ద్వారా రాష్ట్ర ప్రజలను రెచ్చగొడుతూ బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు తెలంగాణ రాష్ట్రంలో సాగబోవని ఎమ్మెల్యే సండ్ర స్పష్టం చేశారు. మండలంలోని పెనుబల్లిలో ఇంటింటికీ ప్రభుత్వ పథకాల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగాగురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పచ్చని తెలంగాణలో మత విద్వేషాలు రగిల్చి ప్రజలను రెచ్చగొడితే సహించబోమని, సీఎం కేసీఆర్ జోలికొస్తే ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మత విద్వేషాలు రెచ్చగొడితే ఎంతటి వారిపైనైనా చట్ట ప్రకారం ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని అన్నారు.