భద్రాచలం:సరోజిని వృద్ధాశ్రమం నిర్వాహకురాలు సరోజనమ్మ సేవలు అభినందనీయమని భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య అన్నారు. మంగళవారం మణుగూరు పట్టణానికి చెందిన “జనం కోసం మనం” అనే స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు గూడూరు కృష్ణారెడ్డి వృద్ధాశ్రమానికి రెండు క్వింటాళ్ల బియ్యం విరాళంగా అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే వీరయ్య, సమాజ సేవకులు, దుర్గాస్వీట్స్ అధినేత బిర్రు సుధాకర్ హాజరై మాట్లాడారు.
వృద్ధులను సొంత తల్లిదండ్రులుగా భావిస్తూ, సరోజనమ్మ అందిస్తున్నసేవలు ప్రశంసనీయమన్నారు. కన్న తల్లిదండ్రులను పట్టించుకోకుండా ఆశ్రమంలో వదిలేసిన వారిని సొంత తల్లిదండ్రులుగా భావిస్తూ, వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపడం గొప్ప విషయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వస్త్ర వ్యాపారి డి.సత్తిలింగం, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సరేళ్ల నరేష్, ఆదిత్య, రవికుమార్, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.