భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో ఈ నెల 16న సహస్ర కలశాభిషేకం నిర్వహించనున్నారు. భక్త రామదాసు కాలం నుంచి ప్రతి నెల ఏదోక ఉత్సవాన్ని నిర్వహించడం అనవాయితీగా వస్తున్నది. అందులో భాగంగా మంగళవారం సాయంత్రం అంకురార్పణ చేయనున్నారు. ముఖ్యంగా సహస్ర కలశాభిషేకం కోసం గోదావరి నదీ మధ్య భాగంలో 500నదులు ప్రవహించే ప్రదేశంలో తీర్ధాన్ని తీసుకువచ్చి మూలమూర్తుల వద్ద ఉంచారు.
మంగళవాయిద్యాలతో వేద మంత్రోచ్ఛరణలతో, ఆలయ అధికారులతో, సకల రాజ లాంఛనాలతో స్వామివారి సన్నిధి చేరుకొని ద్రావిడ పఠనం చేశారు. ఆ తరువాత స్వామివారి వద్ద ఆచార్యుడు ఏకోత్తర శత కలశావాహన కోసం సంకల్పం చేశారు. గోదావరి నుంచి తీసుకొని వచ్చిన పుణ్య జలాలతో మూలమూర్తులకు, ఉత్సవ మూర్తులకు, నిత్య కల్యాణమూర్తులను సంప్రోక్షణ చేశారు.