రుద్రంపూర్, ఫిబ్రవరి 26 : సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ప్రభావిత ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం ధన్బాద్ గ్రామ పంచాయతీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాల్సిందిగా కోరుతూ కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శాలెం రాజుకు ధన్బాద్ ఉప సర్పంచ్ ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామస్తులు కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలు కీలక సమస్యలను జీఎం దృష్టికి తీసుకెళ్లారు. పంచాయతీ పరిధిలో సులబ్ కాంప్లెక్స్ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వీలైనంత త్వరగా సులబ్ కాంప్లెక్స్ను పునర్నిర్మించాలని కోరారు. అలాగే సింగరేణి నుండి వచ్చే కాలువలను నిరంతరం శుభ్రపరచాలన్నారు.
గ్రామ ప్రజలు ముఖ్యంగా తాగునీటి కొరతతో అవస్థలు పడుతున్న నేపథ్యంలో పబ్లిక్ ట్యాప్స్ ఏర్పాటు చేయాలని, గతంలో రుద్రంపూర్, గౌతంపూర్ గ్రామ పంచాయతీలకు కేటాయించినట్లే ధన్బాద్ గ్రామ పంచాయతీకి కూడా ఆర్వో వాటర్ ప్లాంట్ మంజూరు చేయాలని కోరారు. దీంతో పంచాయతీ పరిధిలోని ప్రజలకు శుద్ధి చేసిన తాగునీరు అందుబాటులోకి వస్తుందన్నారు. అలాగే గ్రామ పంచాయతీ ఆర్చ్ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ అంశాలపై జీఎం శాలెం రాజు సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. వినతి పత్రం అందజేసిన వారిలో శ్రీదేవి, మోతి తదితరులు ఉన్నారు.