– ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శాలెం రాజు
రుద్రంపూర్, మార్చి 20 : పవిత్ర రంజాన్ మాసం ఆధ్యాత్మికత, సహనం, దాతృత్వానికి ప్రతీకగా నిలుస్తున్న తరుణంలో ఆర్సిఓఏ క్లబ్ ఆధ్వర్యంలో ముస్లిం ఆఫీసర్స్ అసోసియేషన్, ఉద్యోగుల కోసం ఘనంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శాలెం రాజు ముఖ్య అతిథిగా హాజరై ఉపవాసం విరమించి అనంతరం మాట్లాడారు. రంజాన్ మాసం మనిషిని మంచితనం, క్రమశిక్షణ, పరస్పర గౌరవం వైపు నడిపించే పవిత్ర కాలమన్నారు. రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం ఒకేచోట చేరి ఇఫ్తార్ చేసుకోవడం ద్వారా మనుషుల మధ్య ప్రేమాభిమానాలు మరింత బలపడతాయన్నారు. మత భేదాలు లేకుండా అందరూ కలిసిమెలిసి జీవించడమే సమాజానికి అసలైన బలం అని ఆయన తెలిపారు.
సింగరేణి సంస్థలో వివిధ మతాలు, సంస్కృతులు కలిసిమెలిసి పనిచేయడం సంస్థ ప్రత్యేకత అని, ఇలాంటి కార్యక్రమాలు ఉద్యోగుల మధ్య ఐక్యతను పెంపొందించి సోదరభావాన్ని మరింత బలపరుస్తాయని చెప్పారు. రంజాన్ ఉపవాసం మనకు పేదల కష్టాలను గుర్తుచేసి దాతృత్వం, సేవాభావం పెంచుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు, ముస్లిం ఆఫీసర్స్ అసోసియేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇఫ్తార్ అనంతరం అందరూ పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ స్నేహపూర్వక వాతావరణంలో విందును ఆరగించారు. కార్యక్రమం ఐక్యత, సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలిచింది.
ఈ కార్యక్రమంలో ఎస్ ఓ టు జి. ఎం జీ.వీ కోటిరెడ్డి, ఏరియా ఇంజినీర్ సూర్యనారాయణ రాజు, వీకే ఓసి ప్రాజెక్టు ఆఫీసర్, సి ఎం ఓ ఏ ఐ ఏరియా ఉపాధ్యక్షుడు ఎం.వి నరసింహారావు, ఏజీఎం సివిల్ సిహెచ్ రామకృష్ణ, ఏజిఎం పర్సనల్ మోహన్ రావు, డీజీఎం జాఫర్, ఎస్ఓఎం షాకీర్, డివైఎస్ సి.నజీర్, సంక్షేమ అధికారి ఖలీల్, షకీల్, సీనియర్ పిఓ మతిన్, ఏఐటియుసి వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్, అబ్దుల్ బాషీద్, షకీల్, సోను భాయ్, రుద్రంపూర్ మసీద్ ఏ ఖూబా మౌలానా మొహమ్మద్ మజార్, అజీజ్ ఖాన్, షమీం పాల్గొన్నారు.