చుంచుపల్లి, జులై 01 : చుంచుపల్లి మండలం రాంపురం పరిధిలోని పెద్ద చెరువులో తూము షట్టర్లు దెబ్బతినడంతో వర్షపు నీరు నిల్వ కాకుండా దిగువకు వెళ్లిపోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులో నీరు చేరుతుంది. అయితే తూము షట్టర్లు మరమ్మతులు గురికావడంతో నీరు జారిపోకుండా తూముకు ముందు కట్ట వేసి బస్తాలు, రాళ్లను ఏర్పాటు చేసి బుధవారం రైతులు ఆ నీటిని నిల్వ ఉంచుకున్నారు. చెరువులో నీరు నిల్వ లేకపోతే సాగునీటితో పాటు భూగర్భ జలాలు కూడా అడుగంటిపోయే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. తూము షట్టర్లు పూర్తిగా మరమ్మతులకు గురికావడంతో చెరువులోని నీరు బయటకు వెళ్లకుండా రైతులే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి గోనె సంచులు, మట్టి, రాళ్లతో తాత్కాలికంగా అడ్డుకట్ట నిర్మించి నీటిని నిల్వ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో చెరువులోకి చేరుతున్న నీరు తూముల ద్వారా బయటకు వెళ్లిపోతుండడంతో రైతుల శ్రమ వృథా అవుతోందని పేర్కొన్నారు. ఈ సమస్యపై గతంలోనే ఇరిగేషన్ అధికారి ప్రసాద్రావుతో పాటు జీకేఓసీ అధికారులకు పలుమార్లు వినతిపత్రాలు అందజేసినా ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం చూపలేదని రైతులు తెలిపారు. వెంటనే తూము షట్టర్లకు మరమ్మతులు చేపట్టి చెరువులో నీరు నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులను కోరారు. పెద్ద చెరువులో నీరు నిల్వ ఉంటే వేల ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాల మట్టం కూడా పెరుగుతుందని రైతులు పేర్కొన్నారు. అధికారులు తక్షణమే స్పందించి తూము షట్టర్ల మరమ్మతులు పూర్తి చేసి చెరువును కాపాడాలని రైతులు విజ్ఞప్తి చేశారు.

‘పెద్ద చెరువు తూము షట్టర్లకు మరమ్మతులు చేపట్టాలి’